12న మునుగోడులో వామపక్షాల బహిరంగ సభ

7 Oct, 2022 03:13 IST|Sakshi
టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ సమన్వయ సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు,  ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు 

టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చే విషయంపై కేడర్‌కు వివరించే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికకు వామపక్షాలు సన్నాహాలు మొదలుపెట్టాయి. టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటన, దానికి దారితీసిన పరిస్థితు లను కేడర్‌కు తెలియజెప్పాలని సీపీఎం, సీపీఐ నిర్ణయించాయి. అందులోభాగంగా ఈ నెల 12న మునుగోడులో బహిరంగ సభ నిర్వహించాలని ఆ రెండు పార్టీలు నిర్ణయించాయి. ఈ ఎన్నికలు రావడానికి కారణం ఎవరనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాయి.

బీజేపీ ఎత్తుగడతోనే ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యవ హరిస్తోంది. అందుకే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చేత రాజీ నామా చేయించి, అనంతరం ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయా లన్నది ఎత్తుగడ. బీజేపీ వ్యూహాన్ని ఎండగట్టడం, దాని మతోన్మాద వైఖరిని తూర్పార బట్టడం ఈ సభ ఉద్దేశమని సీపీఐ, సీపీఎం నాయకులు వెల్ల డించారు.

అంతేకాదు దేశంలో బీజేపీ ఆర్థిక విధానాల వల్ల పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో తెలియచేస్తామన్నారు. బీజేపీ ప్రమా దాన్ని ఎదుర్కొనేందుకు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితిని కేడర్‌లోకి తీసుకెళ్తారు. రెండు కమ్యూనిస్టు పార్టీల్లోని కేడర్‌లో టీఆర్‌ఎస్‌పై అక్కడక్కడ అసంతృప్తి నెలకొంది. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలన్న అంశంపైనా కేడర్‌లో కొంత విముఖత వ్యక్తమవుతోంది. దాన్ని పసిగట్టిన రెండు పార్టీలు సభ నిర్వహించడం ద్వారా తమ విధానాన్ని కేడర్‌లోకి తీసుకెళ్లనున్నాయి. 

మరిన్ని వార్తలు