కవితపై బండి సంజయ్‌ వ్యాఖ్యలు.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

11 Mar, 2023 17:01 IST|Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌పై జాతీయ మహిళా కమిషన్‌కు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది. బీఆర్‌ఎస్‌ నేత, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌ రాజీవ్‌ సాగర్‌ ఢిల్లీలోని జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీ బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలోనే బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో బండి సంజయ్‌పై కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అంతేగాక అనుచిత వ్యాఖ్యలు చేసిన సంజయ్‌పై తెలంగాణ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది.

మరోవైపు ఎమ్మెల్సీ కవితపై  బండి సంజయ్‌  వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ముందు బీజేపీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే విధంగా హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ఈడీ ఆఫీస్‌ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో స్థానికంగా పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. 
చదవండి: కవిత వాడుతున్న ఫోన్‌ను అప్పగించాల్సిందిగా ఆదేశించిన ఈడీ 

మరిన్ని వార్తలు