టెస్ట్‌ మిల్లింగ్‌కు రెండు వంగడాలు

17 Jun, 2022 01:11 IST|Sakshi

నూకల శాతాన్ని తేల్చనున్న మైసూర్‌ సీఎఫ్‌టీఆర్‌ఐ శాస్త్రవేత్తలు

ఎంటీయూ 1010, మరో స్థానిక రకం ధాన్యంపై పరీక్షలు జరపాలని నిర్ణయం

ఈ నెల 20 నుంచి జూలై 1 వరకు మిల్లుల్లో పరీక్షలు

ఇందుకోసం 11 జిల్లాల్లో 11 మిల్లుల ఎంపిక

ఇప్పటికే రాష్ట్రం నుంచి నమూనాలు సేకరించి తీసుకెళ్లిన శాస్త్రవేత్తలు

సాక్షి, హైదరాబాద్‌/సిద్దిపేట: రాష్ట్రంలో యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్‌ చేయడం వల్ల వచ్చే నూకల శాతాన్ని పరీక్షించేందుకు మైసూర్‌కు చెందిన సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టి ట్యూట్‌ (సీఎఫ్‌టీఆర్‌ఐ) శాస్త్రవేత్తల బృందాలు ఈ నెల 20 నుంచి రంగంలోకి దిగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాలు సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, యాదాద్రి భువన గిరి, కామారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, వనపర్తి జిల్లాల్లోని 11 మిల్లులను టెస్ట్‌ మిల్లింగ్‌ కోసం శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు.

మొదటి విడతగా మే 27, 28, 29 తేదీల్లో శాస్త్రవేత్తలు మిల్లులను పరి శీలించి, ఎన్నిరకాల వడ్లు పండిస్తారో తెలుసుకుని వాటి నమూనాలను సేకరించిన విషయం తెలిసిం దే. యాసంగిలో రైతాంగం అత్యధికంగా సాగు చేసే వెయ్యిపది (ఎంటీయూ 1010) రకంతోపాటు మ రో స్థానిక వంగడాన్ని తాజాగా టెస్ట్‌ మిల్లింగ్‌ కో సం ఎంపిక చేశారు. ఎంపిక చేసిన 11 మిల్లుల్లో ఈ రెండు రకాల ధాన్యాన్ని ఆయా మిల్లుల సామర్థ్యానికన్నా ఐదు రెట్లు అధికంగా అందుబాటులో ఉంచాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 20 నుంచి జూలై ఒకటో తేదీ వరకు  టెస్ట్‌ మిల్లింగ్‌ ప్రక్రియ సాగనుంది. మొదటి, రెండో విడత పరీక్షల ఫలితాలను బేరీజు వేసుకొని నూక శాతాన్ని ప్రకటించనుంది. ఏయే జిల్లాల్లో ఏ రకం ధాన్యం మిల్లింగ్‌ చేస్తే ఎంతశాతం నూకలు వస్తున్నాయో పరీక్షించి, ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. తదనుగుణంగా ప్రభుత్వం మిల్లులకు పరిహారం ఇవ్వాలని భావిస్తోంది. 

బాయిల్డ్‌ రైస్‌ వద్దనడంతో వచ్చిన చిక్కు 
తెలంగాణలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే ఎక్కువగా నూక అవుతుందన్న విషయం తెలిసిందే. సాధారణంగా క్వింటాలు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే 67 కిలోల బియ్యం రావాలి. కానీ, యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే కొన్ని జిల్లాల్లో 40 కిలోల బియ్యం కూడా రాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో యాసంగి ధాన్యాన్ని బాయిల్డ్‌ రైస్‌గా మిల్లింగ్‌ చేయడం వల్ల నూక శాతం తగ్గి, ఔటర్న్‌ రేషియో నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది.

కానీ, కేంద్రం ఇక నుంచి బాయిల్డ్‌ రైస్‌ను తీసుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే కష్టనష్టాలను ఓర్చి అయినా యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగానే ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 

శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన మిల్లే..
మే నెలలో శాస్త్రవేత్తలు వచ్చి జిల్లాలో వివిధ రకాల వడ్ల శాంపిల్స్‌ను సేకరించారు. మిల్లులను సైతం పరిశీలించారు. శాస్త్రవేత్తలే మిల్లులను ఎంపిక చేసుకున్నారు. టెస్ట్‌ మిల్లింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా నుంచే టెస్ట్‌ మిల్లింగ్‌ ప్రారంభం కానుంది.
–హరీశ్, డీఎం, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్, సిద్దిపేట 

మరిన్ని వార్తలు