-
ఒకే ఒక్క రైస్ మిల్లు... రూ. వంద కోట్ల ధాన్యం దగా
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలోని కొమరబండంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ప్రభుత్వం సరఫరా చేసిన రూ.100 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. గడిచిన రెండేళ్లుగా సీఎంఆర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఈ మిల్లుపై మంగళవారం రాష్ట్ర విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ, పోలీస్శాఖల అధికారులు 30 మంది బృందంగా ఏర్పడి మూకుమ్మడి దాడి చేశారు. దాడి విషయాన్ని ముందుగానే పసిగట్టిన మిల్లు యజమాని నీలా సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, మిల్లు భాగస్వాములు పరారైనట్లు అధికారులు తెలిపారు. దాడుల నిర్వహిస్తున్న టీమ్లకు జిల్లా అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, పోలీస్ అధికారులు సహకారం అందించారు. 3 సీజన్ల నుంచి బియ్యం ఇవ్వడంలేదు. కొమరబండ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండ్రస్ట్రీస్ గత రెండేళ్లుగా, మూడు సీజన్లకు సంబంధించి సుమారు రూ.90 కోట్ల విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు. 2022–23 వానాకాలం సీజన్కు సంబంధించి 15,628 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం 7,067 టన్నులు ఆ మిల్లు ఇచ్చిందనీ, 8,607 టన్నుల బియ్యం బకాయి పడిందని చెప్పారు. ఇక ఇదే సంవత్సరం యాసంగి సీజన్కు సంబంధించి 10,408 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 202 టన్నుల బియ్యం మాత్రమే సదరు మిల్లు నుంచి వచ్చిందని, 10, 206 టన్నులు బకాయి పడిందని వివరించారు. దీంతో పాటు 2023–24 వానాకాలం సీజన్కు సంబంధించి 2748 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 261 టన్నులు మాత్రమే వచ్చిందనీ, ఇంకా 2487 టన్నులు బకాయి ఉందని తెలిపారు. ఈ మూడు సీజన్లకు సంబంధించి మొత్తం 21,300 టన్నుల బియ్యం ఇవ్వాలని దీని విలువ రూ.90 కోట్ల వరకు ఉంటుందని, అపరాధ రుసుంతో కలిపితే దాదాపు రూ.100 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్ కోదాడకు చెందిన శ్రీ వెంకటేశ్వరరైస్ ఇండ్రస్ట్రీస్ యజమాని నీల సత్యనారాయణ కస్టమ్ మిల్లింగ్ రైస్ సక్రమంగా ఇవ్వకపోవడంతో 2022–23 యాసంగి సీజన్కు సంబంధించి మిల్లుకు కేటాయించిన 15,237 టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర స్థాయిలో వేలం వేశారు. వేలంలో ధాన్యం దక్కించుకున్న వారు మిల్లు వద్దకు ధాన్యం కోసం వెళితే అక్కడ ఆ ధాన్యం లేదని చెప్పి, దాన్ని మర పట్టించి ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్పై పూర్తి నివేదికను రాష్ట్ర కమిషనర్కు అందిస్తామని, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
ధాన్యం విక్రయ టెండర్లు రద్దు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైస్మిల్లుల్లో మూలుగుతున్న గత యాసంగి నాటి ధాన్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల సంస్థ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన 10 సంస్థలు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను దక్కించుకున్నాయి. కానీ సగటున క్వింటాల్కు రూ.375 నష్టానికి బిడ్లు ఆమోదం పొందడం, ప్రభుత్వానికి వెయ్యి కోట్ల మేర నష్టం వచ్చే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ధాన్యం టెండర్లపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ టెండర్ల వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేసింది. ఈ క్రమంలో సమాలోచనలు జరిపిన ప్రభుత్వ పెద్దలు.. ఈ టెండర్లను రద్దు చేసి, కొత్తగా బిడ్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈసారి కనీస ధరను కోట్ చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం మద్దతు ధరతో సేకరణ రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి (2022–23)లో పౌర సరఫరాల సంస్థ ద్వారా రూ.2,060 మద్దతు ధరతో 66.85 లక్షల టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ ధాన్యాన్ని యథావిధిగా మిల్లులకు తరలించింది. దాన్ని సీఎంఆర్ కింద ముడిబియ్యంగా మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం కోరినా.. అలా చేస్తే నూకల శాతం ఎక్కువై నష్టం వస్తుందని రైస్మిల్లులు తేల్చి చెప్పాయి. దీంతో సుమారు 9 నెలలుగా మిల్లుల్లో మూలుగుతున్న ఈ ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్న ధరకన్నా తక్కువకు.. 25 ఎల్ఎంటీ ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి టెండర్లు పిలిస్తే 11 సంస్థలు ముందుకురాగా.. ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచిన తరువాత గురునానక్ అనే సంస్థ తిరస్కరణకు గురైంది. మిగతా 10 సంస్థలకు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను కేటాయించారు. ఈ పది సంస్థలు 25 లాట్లను క్వింటాల్కు కనిష్టంగా రూ.1,618 నుంచి గరిష్టంగా రూ.1,732 ధరతో దక్కించుకున్నాయి. సగటున చూస్తే క్వింటాల్ ధర రూ.1,685 మాత్రమే అవుతోంది. ప్రభుత్వం కొన్నధర రూ.2,060తో పోలిస్తే క్వింటాల్కు రూ.375 చొప్పున తక్కువ వస్తుంది. మొత్తంగా రూ.925 కోట్ల నష్టమని అంచనా వేశారు. ఇక సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, కమీషన్లు, మిల్లులకు ధాన్యం రవాణా తదితర ఖర్చులన్నీ కలిపితే క్వింటాల్ ధాన్యానికి మరో రూ.100కుపైగా సర్కారు వెచ్చించింది. ఈ ఖర్చునూ కలిపితే.. మొత్తంగా 25 లక్షల టన్నుల ధాన్యం విక్రయంపై రూ.1,200 కోట్లవరకు నష్టం వస్తుందని లెక్కతేలింది. భారీ నష్టం నేపథ్యంలో ప్రస్తుత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
బడా, లోకల్ మిల్లింగ్ కంపెనీలు కొనేలా!
సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ టెండర్ల ద్వారా రాష్ట్రంలోని రైస్మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వేలం వేయాలని నిర్ణయించిన పౌరసరఫరాల శాఖ బిడ్డింగ్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. ఈ–వేలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి బడా కంపెనీలతో పాటు రాష్ట్రంలోని మిల్లింగ్ కంపెనీలు పాల్గొనేలా సరళమైన విధానాలను టెండర్ నిబంధనల్లో చేర్చారు. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలానికి టెండర్ రాష్ట్రంలోని 2వేలకు పైగా రైస్మిల్లుల్లో నిల్వ ఉన్న సుమారు 70 ఎల్ఎంటీ ధాన్యం నుంచి తొలి విడతగా 25 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గత నెల 19వ తేదీన విధి విధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆసక్తి గల సంస్థలు, వ్యాపారులు దరఖాస్తులు చేసుకోవడంతో ప్రి బిడ్డింగ్ సమావేశాలను సంస్థ నిర్వహించింది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం విధించిన నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నిబంధనల ద్వారా స్థానిక వ్యాపారులు, మిల్లర్లకు అవకాశం దక్కదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే విడతలో 4లక్షల లేదా 5 లక్షల మెట్రిక్ టన్నుల లాట్లలో ధాన్యం వేలం వేయడం వల్ల బడా కంపెనీలే తప్ప రాష్ట్రంలోని మిల్లర్లు గాని, మిల్లర్ల సిండికేట్ గానీ కొనుగోలు చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం నిబంధనల్లో పలు మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రతీ లాట్ను ఒక లక్ష టన్నులుగా మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని తొలి విడత 25 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు వేలం వేయాలని తొలుత నిర్ణయించగా... దాన్ని పూర్తిగా కేవలం 6 లాట్స్లో «వేలం వేయాలని టెండర్ నోటిఫికేషన్లో పొందుపరిచారు.. ఇందులో ఐదు లాట్స్లో 4లక్షల టన్నుల చొప్పున ఉండగా ఒక లాట్లో ఐదు లక్షల టన్నుల ధాన్యం ఉంది. ప్రి బిడ్ మీటింగ్ అనంతరం ఇందులో మార్పులు చేశారు. ప్రతీ లాట్ను ఒక లక్ష టన్నులుగా నిర్ణయించారు. అంటే 25 లాట్స్లో ధాన్యం వేలం వేయనున్నారు. లక్ష టన్నుల కెపాసిటీ ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రతి కంపెనీ ఈ వేలంలో పాల్గొనేలా నిబంధనలు మార్చారు. వార్షిక టర్నోవర్లోనూ భారీ మార్పులు తొలుత ప్రకటించిన టెండర్ నిబందనల ప్రకారం టెండర్లలో పాల్గొనే కంపెనీకి గడిచిన మూడేళ్లలో ప్రతిఏటా రూ.వెయ్యి కోట్ల వార్షిక టర్నోవర్తో పాటు రూ.100 కోట్ల నెట్వర్త్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అయితే రూ. 1000 కోట్ల టర్నోవర్ ఉన్న బియ్యం కొనుగోలు కంపెనీలు దేశంలో అతి తక్కువగా ఉంటాయన్న వాదనల మేరకు ప్రి బిడ్డింగ్ సమావేశంలో ఈ నిబంధనలు కూడా మార్చారు. రూ. 1,000 కోట్ల టర్నోవర్ను రూ.100 కోట్లకు, నెట్వర్త్ విలువ ను రూ.100 కోట్ల నుంచి రూ. 20 కోట్లకు తగ్గించారు. ఇక వేలం తర్వాత ధాన్యం తీసుకెళ్లాల్సిన గడువును 30 రోజుల నుంచి 45 రోజులకు పెంచారు. నిబంధనల్లో మార్పులు చేయడంతో దరఖాస్తు, వేలం తేదీల్లోనూ మార్పులు చేశారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దీంతో ఈ నెల 11న జరగాల్సిన వేలం ప్రక్రియను 16వ తేదీకి వాయిదా వేశారు. నిబంధనల్లో మార్పుతో స్థానిక వ్యాపారులు, మిల్లర్లు టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం లభించనుంది. నిబంధనల సడలింపుతో ఎక్కువ మంది బిడ్డింగ్లో పాల్గొనే అవకాశం ఏర్పడింది. -
అదనపు ధాన్యమంతా ఎగుమతులకే
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన ధాన్యాన్ని, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని సేకరించకుండా ఎఫ్సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటీ పది లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం, నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లో ఉందని, ఎఫ్సీఐ చర్యలతో ఆహారధాన్యాలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని అధికారులు సీఎం దృష్టికి తేవడంతో కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. రానున్న రోజుల్లో అదనంగా వరి దిగుబడి కానున్న పరిస్థితుల్లో రైతు పండించిన వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలిచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా రైతులకు మరింత లాభం చేకూరేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి, సీఎంఆర్ అప్పగింత, బియ్యం తిరస్కరణ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కొత్త మిల్లుల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ శుక్రవారం పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. అదనంగా పండే పంట కోసమే కొత్త మిల్లులు... ‘‘రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వరి ధాన్యం ఉత్పత్తులు ఎగుమతయ్యేలా చూడాలి. అప్పడు తెలంగాణ వరికి గిరాకీ పెరిగి రైతులు లాభాలు గడిస్తారు. అదనంగా పండే పంటను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నూతనంగా అధునాతన మిల్లులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి విధివిధానాలు ఖరారు చేసి కార్యాచరణ ప్రారంభించనున్నాం. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సటాకె వంటి కంపెనీలతో చర్చించాం. వారితో రేపట్నుంచే ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశించాం’’అని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్ తదితర ప్రాజెక్టులతోపాటు మరికొద్ది రోజుల్లో పూర్తికానున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల వరిధాన్యం దిగుబడి ప్రస్తుతమున్న ఏటా 3 కోట్ల టన్నుల నుంచి 4 కోట్ల టన్నులకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ దామోదర్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు వీరే... రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రైస్ మిల్లుల సామర్థ్యం కోటి టన్నుల వరకు ఉండగా మరో 2 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసే దిశగా కొత్త మిల్లులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి విధివిధానాల ఖరారు కోసం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సారథ్యంలో కమిటీని ప్రకటించారు. ఇందులో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, టీఎస్ఐడీసీ ఎండీ నర్సింహారెడ్డి సభ్యులుగా ఉండనున్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మేద్దాం! రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో ఉన్న ధాన్యంలో 40 లక్షల మెట్రిక్ టన్నులను గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మిల్లర్లు సకాలంలో ధాన్యం మిల్లింగ్ చేయకపోవడంతో మిలు్లల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. నిర్దేశత సమయంలో సీఎంఆర్ ఇవ్వకపోవడంతో ఎఫ్సీఐ కొర్రీలు పెడుతోంది. దాదాపు 1.10 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం, 4 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లుల్లో నిల్వల నేపథ్యంలో ధాన్యం విక్రయానికి సీఎం ఆదేశించినట్లు తెలిసింది. -
మిల్లుల్లోనే కోటి మెట్రిక్ టన్నులు!
సాక్షి, హైదరాబాద్: ఎప్పటికప్పుడు గడువు పెంచుతున్నప్పటికీ.. రాష్ట్రంలోని రైస్ మిల్లుల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఎఫ్సీఐ గోడౌన్లకు చేరడం ఆలస్యమవుతోంది. ప్రస్తుతం మిల్లర్ల వద్ద ఇప్పటికే ఏకంగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్టు పౌర సరఫరాల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో 2020–21 యాసంగి మొదలు 2021–22 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉంది. తాజాగా 2022–23 వానాకాలం సీజన్కు సంబంధించి రైతుల నుంచి సేకరించిన 40 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కూడా మిల్లులకు చేరింది. దీంతో రాష్ట్రంలోని సుమారు 3 వేల రైస్మిల్లులు ధాన్యం నిల్వలతో నిండిపోయినట్లు తెలుస్తోంది. ఇలావుండగా జనవరి నెలాఖరులోగా మరో 50 ఎల్ఎంటీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సజావుగా సాగని మిల్లింగ్.. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు పంపించేటప్పుడే 45 రోజుల్లోగా కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యం ఎఫ్సీఐకి అప్పగించాలని పౌరసరఫరాల శాఖ మిల్లర్లతో ఒప్పందం చేసుకుంటుంది. అయితే మిల్లర్లు ఏనాడూ 45 రోజుల్లో మిల్లింగ్ పూర్తి చేసిన దాఖలాల్లేవు. ఇక గత రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో మిల్లింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. ఎంతగా అంటే 2020–21 సంవత్సరపు యాసంగి ధాన్యం 2.03 ఎల్ఎంటీలను ఇక మిల్లింగ్ చేయలేమని మూడు నెలల క్రితం చేతులెత్తేసేంత వరకు. ప్రస్తుత వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతుండగా, 2021–22 వానాకాలం ధాన్యం 70.22 ఎల్ఎంటీల్లో 20.83 ఎల్ఎంటీలు మిల్లింగ్ చేయాల్సి ఉంది. ఇక అదే ఏడాది యాసంగికి సంబంధించిన 50.39 ఎల్ఎంటీల ధాన్యంలో ఇప్పటివరకు కేవలం 13 ఎల్ఎంటీలు మాత్రమే మిల్లింగ్ జరిగింది. ఇంకా 36.93 ఎల్ఎంటీల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంది. ఇలా గత మూడు సీజన్లకు సంబంధించి 59.79 ఎల్ఎంటీల ధాన్యం అంటే సుమారు 40 ఎల్ఎంటీల బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంది. ఐదు నెలల్లో 34 ఎల్ఎంటీలే మిల్లింగ్! సీఎంఆర్ విషయంలో మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరు, సీఎంఆర్ అప్పగింతలో ఆలస్యంపై కేంద్రం గత జూలైలో సీరియస్ అయింది. సీఎంఆర్ తీసుకునేది లేదని రాష్ట్రానికి అల్టిమేటం ఇచ్చింది. అప్పటికి రాష్ట్రంలో మూడు సీజన్లకు సంబంధించి 93.76 ఎల్ఎంటీల ధాన్యం మిల్లర్ల వద్ద ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ లెక్కలు కట్టింది. మొత్తం మీద ఆగస్టు నుంచి తిరిగి సీఎంఆర్ తీసుకునేందుకు ఎఫ్సీఐ ముందుకు వచ్చింది. దీంతో మిల్లింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మిల్లింగ్ చేస్తున్నప్పటికీ.. ఐదు నెలల్లో లెవీ కింద ఎఫ్సీఐకి అప్పగించిన బియ్యం 34 ఎల్ఎంటీలే కావడం గమనార్హం. అంటే నెలకు 10 ఎల్ఎంటీల ధాన్యాన్ని కూడా మిల్లింగ్ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ సీజన్లో 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడి నేపథ్యంలో ఈ సీజన్లో కొనుగోలు కేంద్రాలకు 1.12 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు 6.85 లక్షల మంది రైతుల నుంచి 40.06 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. వచ్చే జనవరి నాటికి మరో 50 ఎల్ఎంటీల ధాన్యం సేకరించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిల్లుల్లోని ధాన్యాన్ని సీఎంఆర్ కింద ఎప్పటికప్పుడు గోడౌన్లకు తరలించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ దిశగా అధికార యంత్రాంగం మిల్లర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement