కోనాయిపల్లి వెంకన్న సన్నిధిలో నామినేషన్‌ పత్రాలపై సంతకాలు

4 Nov, 2023 13:56 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట: కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో నామినేషన్‌ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయాన్ని కేసీఆర్‌ సెంటిమెంట్‌గా భావిస్తారు. ఆయన ఏ పని చేపట్టినా మొదట ఇక్కడి వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీస్సులు తీసుకున్నాకే మొదలుపెడతారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గజ్వేల్, కామారెడ్డిల నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి పోటీ చేస్తున్న హరీశ్‌రావు ఇద్దరూ తమ నామినేషన్‌ పత్రాలతో శనివారం ఈ ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. అనంతరం వాటిపై సంతకాలు చేశారు. నవంబర్‌ 9వ తేదీన రెండుచోట్ల ఆయన నామినేషన్లు వేయనున్నారు.

వెంకన్న ఆశీస్సులతోనే ఉద్యమంలోకి.. 
2001లో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్‌ టీడీపీతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేసి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోకి దిగారు. ఆ సమయంలోనూ కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేశారు. హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్‌ఎస్‌ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడేదాకా పార్టీ చేపట్టే కార్యక్రమాలను ఇక్కడి నుంచీ ప్రారంభించారు.

1985 నుంచీ సంప్రదాయంగా.. 
కేసీఆర్‌ 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే సమయంలో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. ఆ ఎన్నికల్లో గెలవడంతో కోనాయిపల్లి ఆల యం ఆయనకు సెంటిమెంట్‌గా మారింది. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018.. ఇలా ప్రతి ఎన్నికలో ఆయన ఈ ఆలయంలో పూజలు చేశాకే నామినేషన్‌ వేస్తూ వచ్చారు. మంత్రి టి.హరీశ్‌రావు నామినేషన్‌కు ముందు కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశాకే నామినేషన్‌ వేస్తున్నారు.
చదవండి: ఆసక్తికరంగా ‘అలంపూర్‌’ రాజకీయం.. బీఫాం ఎవరికో?

మరిన్ని వార్తలు