‘పార్సిల్‌ స్కాం పసిగట్టండి ఇలా..’

6 Dec, 2023 01:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల నుంచి డబ్బు కొల్లగొట్టేందుకు సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేయని వస్తువుల పేరుతో పార్సిల్‌ వచ్చిదంటూ అమాయకులకు ఫోన్లు చేసి డబ్బు గుంజుతున్నారని సైబర్‌ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వివిధ మార్గాల్లో సేకరించి ఆ వివరాలతో వారికి పార్సిల్‌ వచ్చిందంటూ మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. ఇలా అపరిచిత వ్యక్తులు పంపే పార్సిళ్లలో కొన్ని అక్రమ పదార్థాలు, వస్తువులు ఉంటున్నాయని... అడిగినంత డబ్బు పంపకపోతే అరెస్టు తప్పదని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వీలైనంత డబ్బు గుంజుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

ఎలా గుర్తించాలంటే...
♦ ఆటోమేటెడ్‌ వాయిస్‌ మెసేజ్‌ ద్వారా వచ్చే అనుమానాస్పద వివరాలను, ఆర్డర్‌ చేయని వస్తువులు పార్సిల్‌గా వచ్చాయంటూ వచ్చే ఫోన్స్‌కాల్స్‌ను నమ్మొద్దు.

♦  మీకు పార్సిల్స్‌ వచ్చాయంటూ వచ్చే ఈ–మెయిల్స్‌లో పార్సిల్‌ పంపిన వారి అడ్రస్, ఫోన్‌ నంబర్లు పరిశీలించాలి. అనుమానాస్పద నంబర్ల నుంచి పార్సిళ్లకు సంబంధించిన మెసేజ్‌లు వస్తే అవి నకిలీవని గుర్తించాలి. మెసేజ్‌లు, ఈ–మెయిల్స్‌లో అక్షర దోషాలు, అచ్చు తప్పులను గుర్తించాలి. అలాంటివి నకిలీవని గుర్తుంచుకోవాలి.

♦ మీరు ఆర్డర్‌ చేయని పార్సిళ్లకు, మీ పేరిట వచ్చిన పార్సిల్‌లో ఏవైనా అక్రమ వస్తువులు ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడి డబ్బు డిమాండ్‌ చేసినా డబ్బు పంపొద్దు. వెంటనే పోలీసులకు ఈ సమాచారాన్ని ఇచ్చి ఫిర్యాదు చేయాలి. 

>
మరిన్ని వార్తలు