వాకింగ్‌ చేస్తూ.. గుండెపోటుతో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మృతి

26 Oct, 2023 09:45 IST|Sakshi

హైదరాబాద్: మలక్‌పేట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మదలంగి సురేష్‌ (50) వాకింగ్‌ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు..ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన సురేష్‌ 2000 సంవత్సరం బ్యాచ్‌ కానిస్టేబుల్‌. నగరంలోని సంతో‹Ùనగర్‌ ఈస్ట్‌మారుతినగర్‌లో ఉంటున్నారు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

బుధవారం ఉదయం 7 గంటలకు వాకింగ్‌ చేస్తున్న సురేష్‌ ఒక్కసారిగా కింద పడిపోయాడు. తోటి వాకర్స్‌ వెంటనే కంచన్‌బాగ్‌ డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. కోవిడ్‌ నుంచి ఆయన రెండుసార్లు కోలుకున్నారు. విషయం తెలుసుకున్న సౌత్‌ఈస్ట్‌ ట్రాఫిక్‌ ఏసీపీ సత్యనారాయణ, మలక్‌పేట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగం చంద్రశేఖర్‌ ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

మరిన్ని వార్తలు