తెలంగాణలోని ప్రముఖ ఆలయాలకు ఐటీ శాఖ నోటీసులు

5 Oct, 2023 11:43 IST|Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట: తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆదాయపు పన్ను కట్టాలంటూ కొమురవెల్లి, రాజన్న, బాసర ఆలయాలకు నోటీసులు పంపించింది. ఈ జాబితాలో కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయం తొలి స్థానంలో ఉంది.

రూ. 8 కోట్ల ట్యాక్స్ కట్టాలని, సకాలంలో పన్ను కట్టనందువల్ల మరో రూ. 3 కోట్ల జరిమానా కూడా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఐటీ రిటర్న్‌లు, 12ఏ రిజిస్ట్రేషన్‌ గడువు గత నెల 30వ తేదీతో ముగిసింది. రిటర్న్స్, 12ఏ రిజిస్ట్రేషన్‌ చేయించుకోకపోవడంతో ఈ నోటీసులను జారీ చేశారు.  

అదే విధంగా వేములలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాలనికి కూడా ఐటీశాఖ నోటీసులు జారీచేసింది.  లెక్క ప్రకారం ఆదాయ పన్నును చెల్లించాలంటూ నోటీసులు పంపించింది. ఇక  బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు ఇంకా పలు దేవాలయాలకు కూడా నోటీసులు అందాయి.

మరోవైపు ఆలయాలకు ఐటీ నోటీసులు ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు ఆలయాలపై కఠిన వైఖరిని అవలంబించడం సరైన విధానం కాదని అంటున్నారు. పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులను వదిలిపెట్టి ఆధ్యాత్మిక కేంద్రమైన దేవాలయాకు పన్ను కట్టాలని నోటీసులు ఇవ్వడంపై  తీవ్రంగా మండిపడుతున్నారు.
చదవండి: ఈనెల రెండో వారంలో తెలంగాణకు రాహుల్‌ గాంధీ

మరిన్ని వార్తలు