ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి జర్నలిస్టులు

19 Aug, 2022 02:10 IST|Sakshi

టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందంతో మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం(ఈహెచ్‌ఎస్‌) పరిధిలోకి జర్నలిస్టులు వస్తారని, ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూని యన్‌(ఐజేయూ) అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్న లిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధానకార్యదర్శి విరాహత్‌ అలీ నేతృత్వంలో యూనియన్‌ ప్రతినిధి బృందం గురువారం సాయంత్రం అరణ్యభవన్‌లో మంత్రితో సమావేశమై హెల్త్‌కార్డుల సమస్యపై వినతిపత్రా న్ని అందించింది.

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో హెల్త్‌కార్డులు తిరస్కరణకు గురవుతుండటంతో జర్నలిస్టులు పడుతున్న కష్టాలను ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈహెచ్‌ఎస్‌ అమలుకు బడ్జెట్‌లో కేటా యించిన నిధులను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. పథకం అమలును పర్యవేక్షించడానికి మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రతినిధి బృందంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్‌ శ్రీకాంత్‌ ఉన్నారు.

ఆపదలో ఉన్న జర్నలిస్టుకు అండగా నిలిచిన హరీశ్‌
ఆపదలో ఉన్న ఓ పాత్రికేయుడికి మంత్రి హరీశ్‌రావు అండగా నిలిచారు. బషీర్‌బాగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్‌ పాత్రికేయుడు పుండరీచారి సతీమణి వినోద నాలుగు రోజుల క్రితం అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చేరింది. అయితే ఆశించినస్థాయిలో ఆమెకు చికిత్స జరగడంలేదనే విషయాన్ని టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందిస్తూ వినోదకు ఏఎంసీలో బెడ్‌ కేటాయించి, మెరుగైన చికిత్స అందించాలని ఉస్మానియా సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.  

మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం ఇస్తున్న జర్నలిస్టు సంఘాల నేతలు కె.శ్రీనివాస్‌రెడ్డి, విరాహత్‌ అలీ తదితరులు 

మరిన్ని వార్తలు