ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా

22 Nov, 2022 17:54 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు ‍కేసును తెలంగాణహైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు విచారణకు హాజరు కాలేదని హైకోర్టుకు సిట్‌ స్పష్టం చేసింది. వారికి నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదని, ఏదైనా ఆర్డర్‌ ఇవ్వాలని హైకోర్టును సిట్‌ కోరింది. బీఎల్‌ సంతోష్‌కు నోటీసులు అందాయని అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు.సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, సిట్‌ విచారణ అంశాలపై రేపు మరోసారి విచారిస్తామన్న హైకోర్టు తన విచారణను వాయిదా వేసింది. 

కాగా, ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు హాజరు కావాల్సి ఉన్న ముగ్గురికి లుకౌట్‌ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేరళ బీడీజేఎస్‌ అధినేత తుషార్‌, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలు సోమవారం విచారణకు హాజరు కాలేదు. బీఎల్‌ సంతోష్‌ ఆఫీస్‌లో సైతం పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో బీఎల్‌ సంతోష్‌ తాను వేరే రాష్ట్రంలో పర్యటిస్తున్నాని, అందువల్ల సిట్‌ ముందుకు వచ్చేందుకు సమయం కావాలని కోరాడు. ఐతే కేరళ వైద్యుడు జగ్గుస్వామీ మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. దీంతో   అతను విదేశాలకు పారిపోకుండా తెలంగాణ పోలీసులు అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అలర్ట్‌ చేయడమే కాకుండా  విదేశాలకు చెక్కేయకుండా లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేసింది సిట్‌.

మరిన్ని వార్తలు