క్వార్టర్‌ సీసా తెస్తాడని నమ్మితే నట్టేట ముంచాడు.. ఎంతసేపు చూసినా రాకపాయె!

27 Nov, 2022 17:06 IST|Sakshi

నాగిరెడ్డిపేట (నిజామాబాద్‌): ఓ గుర్తు తెలియని వ్యక్తి మద్యం తాగుదామని పరిచయం పెంచుకొని బైక్‌ ఎత్తుకెళ్లిన ఘటన నాగిరెడ్డిపేట మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎర్రగుట్ట తండాకు చెందిన మాలవత్‌ లింగ్య ఈ నెల 24న మద్యం తాగేందుకు తన ద్విచక్ర వాహనంపై గోపాల్‌పేట మద్యం దుకాణం వద్దకు వెళ్లాడు. అదే సమయంలో వైన్‌షాపు వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి లింగ్యతో పరిచయం చేసుకుని మాటలు కలిపాడు.

ఈ క్రమంలో ఇద్దరు కలిసి మద్యం తాగుదామని నిర్ణయించుకున్నారు. సదరు వ్యక్తి మద్యం షాప్‌నకు వెళ్లి క్వార్టర్‌ బాటిల్‌ను తీసుకున్నాడు. ఇద్దరు కలిసి బైక్‌పై మండలంలోని తాండూరు శివారులో పౌల్ట్రీఫామ్‌ వెనుకకు వెళ్లి మద్యం తాగారు. మరికొంత మద్యం తాగుదామని చెప్పడంతో లింగ్య అంగీకరించాడు. దీంతో గుర్తుతెలియని వ్యక్తి లింగ్య బైక్‌ను తీసుకుని మద్యం తెస్తానని చెప్పి వెళ్లి.. తిరిగి రాలేదు. దీంతో తన బైక్‌ పోయిందని గుర్తించి, ఇట్టి విషయమై బాధితుడు లింగ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.   
(చదవండి:  వలపు వల విసిరి బ్లాక్‌మెయిల్.. రూ.80 లక్షలు వసూలు చేసిన జంట)

మరిన్ని వార్తలు