రఘనందన్‌ రావు.. ఇన్నోవా వీడియో ఎందుకు చూపించలేదు: రేణుకా చౌదరి

7 Jun, 2022 13:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. టీఆర్‌ఎస్‌, బీజేపీపై నిప్పులు చెరిగారు. 

రేణుకా చౌదరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రోజుల వ్యవధిలో తెలంగాణలో ముగ్గురు మహిళలపై లైంగిక దాడులు జరిగాయి. తెలంగాణలో పసి పిల్లలకు కూడా రక్షణ కరువైంది. ఇదేనా బంగారు తెలంగాణ అంటే..?. జూబ్లీహిల్స్ కేసులో అధికార పార్టీ నేతల పిల్లలు ఉన్నారు కాబట్టే.. ఈ కేసును నీరుగారుస్తున్నారు. వేలల్లో కేసులు నమోదయితే.. 46 కేసులలో మాత్రమే దోషులకు  శిక్ష పడింది. జూబ్లీహిల్స్ మైనర్ కేసును వదిలేది లేదు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ ఎందుకు నోరు విప్పడంలేదు. షీ టీమ్స్ ఏమయ్యాయి..?. 

మైనర్ వీడియోను బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా దోషే. రఘునందన్‌ రావు ఇన్నోవా బండి వీడియో ఎందుకు బయటపెట్టలేదు. ఆయన సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త వాంగ్మూలంలో మంత్రి పువ్వాడనే తన చావుకు కారణం అని చెప్పినా ప‍్రభుత్వం నుంచి చర్యలు లేవు. నగరంలో రక్షణ లేనప్పుడు..పెట్టుబడులు ఎలా వస్తాయి. రాష్ట్రంలో పబ్బుల కల్చర్ పెరిగింది. లైసెన్స్‌లు ఇస్తుంది.. ఎక్సైజ్ శాఖ కాదా..?’’ అని ప్రశ్నించారు. 

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే రఘునందర్‌రావుపై కేసు నమోదు

మరిన్ని వార్తలు