ఎకరాలోపు 16.04లక్షల మందికి రైతుబంధు 

29 Dec, 2020 03:12 IST|Sakshi

రూ. 494.11 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

విడతలవారీగా మిగిలిన వారికి అందజేత

సాక్షి, హైదరాబాద్‌: యాసంగి రైతుబంధు సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కావడం మొదలైంది. ఎకరాలోపు భూములున్న రైతులకు రైతుబంధు సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అందజేసింది. తొలిరోజు 16,03,938 మంది రైతులకు రైతుబంధు అందింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున 9,88,208 ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఎకరంలోపు భూములున్న రైతుల ఖాతాల్లో రూ. 494,10,86,470 బదిలీ అయింది.

వాస్తవానికి ఎకరంలోపున్న భూములకు రూ. 559.99 కోట్లు సిద్ధం చేయగా 2.65 లక్షల మంది రైతుల బ్యాంకు వివరాలు లేకపోవడంతో రూ. 65.88 కోట్లు మిగిలాయి. రాష్ట్రంలో మొత్తం 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు రైతుబంధు అర్హత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. యాసంగిలో ఎకరానికి రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం రూ. 7,515 కోట్లు పంట సాయంగా అందించనుంది. చదవండి: (బ్రహ్మోత్సవాలలోపే యాదాద్రి ప్రారంభం?)

తొలిరోజు ఎకరంలోపు భూములున్న వారికి ఇచ్చామని, ఇలా వరుసగా రెండెకరాలు, మూడు ఎకరాల చొప్పున రైతులందరికీ విడతలవారీగా రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. తొలిరోజు ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 9,239 మంది రైతులకు రైతుబంధు అందగా అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 1,05,545 మందికి రైతుబంధు అందింది. మొదటి రోజున నిధులు తక్కువ అందిన జిల్లాగా అత్యల్పంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నిలిచింది. ఇక్కడ 12,884 మంది ఎకరంలోపున్న రైతులు ఉండగా రూ. 3.37 కోట్ల నిధులు మాత్రమే అందాయి.   

మరిన్ని వార్తలు