Teenmar Mallanna: తీన్మార్‌ మల్లన్న అరెస్ట్‌.. అరెపల్లిలో ఉద్రిక్తత

28 May, 2022 20:53 IST|Sakshi

సాక్షి, హన్మకొండ: జిల్లాలోని ఆరెపల్లిలో భూసేకరణ జీఓ 80ఏ ను రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన రైతుల ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీసింది.‌ రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు.‌ అరెస్టును అడ్డుకునేందుకు రైతులు, రైతు కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.‌ గ్రామసభ నిర్వహిస్తుంటే పోలీసులు వచ్చి అడ్డుకున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆందోళన కారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు రైతులను నెట్టేసి, తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి వేలేరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం స్వంత పూచికత్తుపై వదిలిపెట్టారు.

అయితే జీఓ 80ను వ్యతిరేకంగా ఆరెపల్లిలో రైతులు పోచమ్మ ఆలయం వద్ద గ్రామ సభ నిర్వహించగా వారికి మద్దతుగా వెళ్ళితే అరెస్టు చేయడంతో పాటు అక్రమ కేసు నమోదు చేశారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని, ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన జీవో 80ఏ ను రద్దు చేసే వరకు రైతుల పక్షాన పోరాడుతానని స్పష్టం చేశారు. గ్రామంలో ప్రశాంతంగా గ్రామ సభ పెట్టుకుంటే పోలీసులు వచ్చి సభను భగ్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతమందిని అరెస్ట్‌ చేసిన ఉద్యమం ఆగదని, భూసేకరణ జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
చదవండి: ఊరు మునిగింది.. ఉపాధి పోయింది!

మరిన్ని వార్తలు