భౌతిక దూరం.. భద్రత..!

31 Aug, 2020 01:43 IST|Sakshi

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు

ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ రద్దు, సభా సమయం కుదింపు?

కరోనా నేపథ్యంలో వీలైనంత త్వరగా సమావేశాల ముగింపు

మీడియా పాయింట్, మీడియా పాస్‌లపై త్వరలో నిర్ణయం

సందర్శకులకు నో ఎంట్రీ

సాక్షి, హైదరాబాద్‌ : శాసనసభ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 7న ప్రారంభం కానున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ సమావేశాలు నిర్వహించ డంపై అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. శాసనసభ, శాసన మండలి సమావేశ మందిరాల్లో సభ్యులు భౌతిక దూరం పాటించేలా సీట్ల ఏర్పాటు ప్రక్రియ దాదాపు పూర్తికావొచ్చింది. మండలిలో సీట్ల ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర వకున్నా, శాసనసభలో మాత్రం సభ్యుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అదనపు సీట్ల ఏర్పాటు పనులు కొలిక్కి వచ్చాయి. సమావేశ మందిరాల్లోకి ప్రవేశించే ద్వారాలతో పాటు ఇతర చోట్ల శానిటైజేషన్‌ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 

నిర్వహణ తీరుపై మల్లగుల్లాలు..
సుమారు 15 రోజుల నుంచి 20 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహిస్తా మని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. శాసనసభ సమావేశాల ప్రారంభం తొలి రోజు సభను ఎన్ని రోజుల పాటు, ఏ తరహాలో నిర్వహించాలనే అం శంపై బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే కరోనా పరిస్థితుల్లో శాసనసభను ఎన్ని రోజులు, రోజుకు ఎన్ని గంటల చొప్పున నిర్ణయించాలనే అంశంపై అధికారులు పలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ రద్దు చేయడం, సభా సమయం కుదింపు వంటి ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సభ మొదలైన వెంటనే నేరుగా తీర్మానాలు, చర్చలు ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రజాప్రతి నిధులు, అధికారులు, సిబ్బంది, మీడియా తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా ముగించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం?
కోవిడ్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సందర్శకులు, మీడియా ప్రతినిధులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోను న్నారు. సందర్శకులకు అనుమతి నిరాకరించడంతో పాటు విజిటర్స్‌ గ్యాలరీని కూడా మీడియాకు కేటాయించే అవకాశం ఉంది. మీడియా ప్రతినిధుల సంఖ్యను కూడా కుదించి అనుమతించాలనే అంశంపై ఒకటి, రెండు రోజుల్లో జరిగే మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్‌ జరిపే సన్నాహక సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మీడియా పాయింట్‌ను తాత్కాలికంగా ఎత్తివేయడంతో పాటు, అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను యూట్యూబ్‌లో ప్రసారం చేయడంలోని సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తు న్నట్లు తెలిసింది. త్వరలో నిర్వహించే సమీక్షలో సమావేశాల నిర్వహణ తీరుతెన్నులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు