వైన్షాపు టెండర్ల దరఖాస్తు రుసుము రూ. 2లక్షలే..
ధరావతు చెల్లించాల్సిన అవసరం లేదు..
బ్యాంకు గ్యారంటీ 25 శాతానికి ఇస్తే చాలు
ఫీజు చెల్లింపు వాయిదాల సంఖ్య 4 నుంచి 6కు పెంపు..
గౌడ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 30 శాతం రిజర్వేషన్...
2021–23 మద్యం పాలసీని నోటిఫై చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండేళ్లకు గాను మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. 2021–23 సంవత్సరాలకు వైన్ (ఏ4) షాపుల కేటాయింపు నిబంధనలతో సీఎస్ సోమేశ్కుమార్ శనివారం జీవో ఎంఎస్ నం.98 విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి వచ్చే 2023 నవంబర్ 30 వరకు ఈ పాలసీ వర్తిస్తుంది.
గత రెండేళ్ల కాలా నికి (2019–21) ఇచ్చిన నోటిఫికేషన్లో స్వల్ప మార్పులు చేస్తూ ఈ నిబంధనలు రూపొందించారు. మద్యం దుకాణాల కోసం టెండర్ దరఖాస్తు ఫీజును గతంలోలాగే రూ.2 లక్షలుగా నిర్ధారించగా, ఎక్సైజ్ ఫీజును కూడా పాత స్లాబుల్లోనే కొనసాగించారు. అయితే ఫీజు చెల్లింపు వాయిదాల పెంపు, బ్యాంకు గ్యారెంటీ చూపించాల్సిన మొత్తం తగ్గింపు, టర్నోవర్పై రిటైల్ వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ పెంపు లాంటి నిర్ణయాలతో ఈసారి కొత్త మద్యం పాలసీ విడుదల చేశారు.
ఏ4 షాపుల కేటాయింపు నిబంధనలివే..
పెంచుదామా.. వద్దా?
రాష్ట్రంలో అదనంగా కొత్త షాపులను నోటిఫై చేద్దామా వద్దా అన్న దానిపై ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 2,216 (ఏ4) వైన్షాపులకు అనుమతి ఉంది. ఈ షాపుల సంఖ్యను రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి పెంచలేదు. ఈసారి రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో షాపుల సంఖ్య పెంచే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. భారీగా అమ్మకాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ షాపులు పెంచుదామనే కసరత్తు జరుగుతోంది. అయితే మరో 350 దుకాణాలా? 220 దుకాణాలా లేదా అసలే పెంచకుండా పాత షాపులనే నోటిఫై చేద్దామా అన్న దానిపై తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
ఇప్పటికే రాష్ట్రంలోని బార్షాపులు నష్టాల్లో నడుస్తున్నాయన్న చర్చ నేపథ్యంలో వైన్షాపులు పెంచితే బార్లు ఆర్థికంగా మరింత దెబ్బతింటాయని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే, ప్రభుత్వం శనివారం ఇచ్చిన నోటిఫికేషన్లో షాపుల సంఖ్య ప్రస్తావన లేదు. దరఖాస్తు షెడ్యూల్ విడుదల సమయంలో ఈ సంఖ్యను స్పష్టం చేస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా నేడో, రేపో వెలువడుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈనెల 9 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరించి 20న డ్రాలు తీసి, అదే రోజున ప్రొవిజనల్ లైసెన్సులు ఇస్తారు. కొత్త షాపులు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
ఎక్సైజ్ ఫీజు స్లాబులివే:
జనాభా ఎక్సైజ్ ఫీజు (సంవత్సరానికి లక్షల రూపాయల్లో)
5 వేల వరకు 50
5 వేల నుంచి 50 వేల వరకు 55
50 వేల నుంచి లక్ష వరకు 60
లక్ష నుంచి 5లక్షల వరకు 65
5 నుంచి 20లక్షల వరకు 85
20 లక్షల కంటే ఎక్కువ 110