రిస్క్ దేశాల నుంచి 791 మంది రాక
అందులో ఒకరికి సాధారణ కరోనా పాజిటివ్
జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపిన యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం 26,625 మందికి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 146 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,78,288కి చేరింది. ఒక రోజులో ఇద్దరు చనిపోగా, ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,007కు చేరినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇక తాజాగా 189 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 6,70,435కి పెరిగింది. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ ఉన్న రిస్క్ దేశాల నుంచి ఆదివారం 791 మంది హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. వారిలో ఒకరికి కరోనా నిర్ధారణ అయింది. ఆ వ్యక్తి నమునాలను జినోమ్ సీక్వెన్సింగ్కు పంపారు. దీంతో కలిపి మొత్తం నలుగురి శాంపిళ్లు ప్రస్తుతం జినోమ్ సీక్వెన్సింగ్ జరుగుతున్నాయి. ఆ ఫలితాలు రావాల్సి ఉంది.