‘యాదాద్రి’లో కైంకర్యాల ధరలు పెంపు

10 Dec, 2021 04:12 IST|Sakshi

నిత్యపూజలు, లడ్డూ ప్రసాదం ధరలు సైతం.. 

నేటి నుంచి అమలు 

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులు జరిపించే శ్రీస్వామి వారి కైంకర్యాలు, శాశ్వత పూజలు, భోగాలతో పాటు ప్రసాదం ధరలను పెంచుతున్నట్లు ఈవో గీతారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి దేవస్థానంతో కొండపైన గల శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి, అనుబంధ పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సైతం ధరలు పెంచినట్లు తెలిపారు. పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు.  

యాదాద్రిలో పెంచిన ధరలివి 
నిజాభిషేకం (ఇద్దరికి) గతంలో రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.800 చేశారు. ఒక్కరికి రూ.250 ఉంటే ప్రస్తుతం రూ.400లకు పెంచారు. సహస్ర నామార్చనకు రూ.216 ఉంటే రూ.300, సుదర్శన నారసింహ హోమానికి రూ.1,116 ఉంటే రూ.1,250, నిత్య కల్యాణోత్సవానికి రూ.1,250 ఉంటే రూ,1,500, స్వాతి నక్షత్రం రోజున నిర్వహించే శత ఘటాభిషేకానికి (ఇద్దరికి) రూ.750 ఉంటే రూ.1,000, లక్ష పుష్పార్చనకు రూ.2,116 ఉంటే రూ.2,500, వెండి మొక్కు జోడు సేవలకు రూ.500 ఉంటే రూ.700, సువర్ణ పుష్పార్చనకు రూ.516 ఉంటే రూ.600, వేదాశీర్వచనం రూ.516 ఉంటే రూ.600, ఆండాల్‌ అమ్మవారి ఊంజల్‌ సేవకు రూ.750 ఉంటే రూ.1000, సత్యనారాయణస్వామి వ్రతాలు (సామగ్రితో కలిపి) రూ.500 ఉంటే రూ.800, గో పూజకు రూ.50 ఉంటే రూ.100, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలకు వీఐపీల కోసం ప్రత్యేకంగా రూ.1,500, ఉపనయనం రూ.50 ఉంటే రూ.500, అక్షరాభ్యాసం రూ.51 ఉంటే రూ.200, అష్టోత్తర పూజకు రూ.100 ఉంటే రూ.200, అన్నప్రాశన (ఐదుగురికి) రూ.500 ఉంటే రూ.1000కి పెంచారు. 

ప్రసాదం ధరల వివరాలివి 
స్వామివారి లడ్డూ ప్రసాదం ధరలను సైతం అధికారులు పెంచారు. వంద గ్రాముల లడ్డూ గతంలో రూ.20 ఉంటే రూ.30కి పెంచారు. 500 గ్రాముల లడ్డూ రూ.100 ఉంటే రూ.150, 250 గ్రాముల పులిహోర రూ.15 ఉంటే రూ.20, 250 గ్రాముల వడ రూ.15 ఉంటే రూ.20కి పెంచారు. శివాలయంలో, పాతగుట్ట ఆలయంలోనూ పూజల ధరలను పెంచారు. శాశ్వత పూజల ధరలు కూడా పెరిగాయి.     

>
మరిన్ని వార్తలు