Telangana: తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం

25 Jun, 2022 16:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా అనుమతి తప్పసరి చేస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలిచ్చింది.

జూన్‌ 8న వచ్చిన ఓ ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా చందంపేట మండలం గుంటిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్, అతని సోదరుని మధ్య భూవివాదం ఉంది. ఇరువురు కూడా పెద్ద ఎత్తున పలుకుబడి ఉపయోగించి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అన్నదమ్ములు ఫిర్యాదు చేసుకున్నారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన విజిలెన్స్‌ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఆదేశాలు గతంలో ఉన్నప్పటికీ తాజాగా ప్రతియేటా సమర్పించాలని ఆదేశించడం సరైంది కాదని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పుకు అందరినీ దోషులుగా ఆపాదించడం కరెక్ట్‌ కాదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. 

చదవండి: ('48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే.. మా శవాల లొకేషన్‌ షేర్‌ చేస్తా')

మరిన్ని వార్తలు