ఎమ్మెల్యేలకు ఎర కేసు.... ఇప్పట్లో సిట్‌ ఎదుట సంతోష్‌ హాజరు లేనట్టే!

21 Nov, 2022 08:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసు­లో బీజేపీ జాతీయ ప్ర­ధా­న కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌ ఇప్పట్లో హాజరయ్యే అ­వ­కా­శాలు కనిపించడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. సిట్‌ గతంలో ఇచ్చిన నోటీసు మేరకు బీఎల్‌ సంతోష్‌ సోమవారం విచారణకు కావాల్సి ఉంది. మరోవైపు సోమ, మంగళవారాల్లో రాష్ట్ర బీజేపీ నాయకులకు నిర్వహిస్తున్న ప్రశిక్షణ్‌ శిబిరంలో సంస్థాగత అంశాలపై ఆయన శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కానీ బీఎల్‌ సంతోష్‌ ప్రశిక్షణ్‌ శిబిరానికి హాజరుకా­వడం లేదని, ఆయన తీసుకునే సెషన్‌ను తొలగించారని తెలిసింది.

అయితే సాంకేతికంగా సంతోష్‌కు ఇంకా నోటీసులు అందలేదని, లేదా ఆయన స్వయంగా స్వీకరించలేదని.. అందువల్ల ఆయన దీనిపై స్పందించడంగానీ, విచారణకు హాజరుకావడంగానీ జరగకపోవచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కోర్టు ఢిల్లీ పోలీసుల ద్వారా సంతోష్‌కు నోటీసులు అందజేయాలని సూచించిందని.. మరి ఢిల్లీ పోలీసులు వెంటనే స్పందించి నోటీసులిస్తారా, సమయం తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది.

ఒకవేళ నోటీసు­లు అందినా సంతోష్‌ తరఫు న్యాయవాది హాజరై కొంత సమయం కోరే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం బీఎల్‌ సంతోష్‌ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని, ఇప్పట్లో సిట్‌ విచారణకు హాజరయ్యే అవకాశాలు లేవని అంటున్నారు.
చదవండి: గవర్నర్‌ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు

మరిన్ని వార్తలు