రామలింగారెడ్డి భార్యకే దుబ్బాక టికెట్‌? 

15 Sep, 2020 03:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక శాసనసభ స్థానం ఉప ఎన్నికలో దివంగత శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకు టికెట్‌ ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. టికెట్‌ కేటాయింపునకు సంబంధించి పార్టీ అధిష్టానం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ రామలింగారెడ్డి భార్యకు టికెట్‌ ఖరారైనట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ టికెట్‌ను సోలిపేట రామలింగారెడ్డి కుటుంబంతో పాటు, మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కూడా ఆశిస్తున్నారు.

సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కుమారుడు సతీష్‌రెడ్డి అభ్యర్థిత్వంపై పార్టీ నాయకులు, ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. తమ కుమారుడు సతీష్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని రామలింగారెడ్డి భార్య సుజాత కోరుతున్నా, పార్టీ నాయకులు మాత్రం సుజాత అభ్యర్థిత్వంవైపే మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. కరోనా వైరస్‌ సోకడంతో హోం క్వారంటైన్‌లోకి వెళ్లిన మంత్రి హరీశ్‌రావు కోలుకుని సోమవారం అసెంబ్లీకి హాజరయ్యారు. క్వారంటైన్‌ సమయంలో ఫోన్‌ ద్వారా దుబ్బాక నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకులను సమన్వయం చేసిన మంత్రి హరీశ్‌రావు మంగళవారం నుంచి క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. 

>
మరిన్ని వార్తలు