పుట్టిన కాసేపటికే కన్నుమూసిన పసికందులు

16 Dec, 2020 08:20 IST|Sakshi

సాక్షి, కోదాడ: నెలల నిండకముందే పుట్టిన ఆ కవల ఆడ పిల్లలను ఆ తల్లి వద్దనుకుంది. వైద్యశాలకు వచ్చిన అత్త చేతిలో పెట్టి తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. ఈలోగా కవలల్లో ఒకరు.. మరికొంతసేపటికి మరొకరు.. ఇద్దరూ మృతిచెందారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరానికి చెందిన ఆరోగ్యానికి చిలుకూరుకు చెందిన నాగరాజుతో ఏడాది క్రితం వివాహమైంది. ఏడో నెల గర్భిణిగా ఉన్న ఆరోగ్యానికి నొప్పులు రావడంతో మంగళవారం ఉదయం కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చేరింది. ఆమెకు సాధారణ ప్రసవంలో కవల ఆడపిల్లలు జన్మించారు. బరువు తక్కువతో అనారోగ్యంగా ఉండటంతో వైద్యులు చికిత్స కోసం ఖమ్మం వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించారు. చదవండి: క్లాసులంటూ పిలిచి.. పసిమొగ్గలపై అఘాయిత్యం 

విషయం తెలుసుకున్న భర్త, అతని తల్లి వైద్యశాలకు వచ్చారు. అంతలో ఆరోగ్యం.. తనకు పిల్లలు వద్దంటూ వారిని అత్త చేతిలో పెట్టి తల్లి గారింటికి వెళ్లిపోయింది. దీంతో భర్త, అత్త కలిసి కవలలతో కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లగా, అప్పటికే ఇద్దరిలో ఒకరు మృతి చెందారని వైద్యులు చెప్పారు. మృతశిశువుతో పాటు బతికున్న శిశువును తీసుకొని వెళ్తున్న క్రమంలో రెండో బిడ్డ కూడా కన్నుమూసింది. ఇద్దరినీ స్వగ్రామంలో ఖననం చేశారు. దీనిపై తమకు ఫిర్యాదు అందలేదని కోదాడ రూరల్‌ పోలీసులు చెప్పారు. 

మరిన్ని వార్తలు