'రైల్వేలను ప్రైవేటైజేషన్ చేసే ప్రసక్తే లేదు.. కేటీఆర్ లెక్కలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది..'

4 Feb, 2023 17:16 IST|Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కవచ్' కేంద్రాన్ని పరిశీలించారు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ బలమైన జాతి నిర్మాణం కోసం పెట్టాలనేది ప్రధాని మోదీ ఆలోచన అని చెప్పారు. ప్రపంచం అంతా ద్రవ్యోల్బణం వైపు వెళ్తుంటే మన దేశం అభివృద్ధి వైపు వెళ్తుందన్నారు. 2014లో ఇండియా 10 వ స్థానంలో ఉంటే ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందని పేర్కొన్నారు. అతి త్వరలో టాప్‌-3 లో ఇండియా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వే కేటాయింపులు రూ.886 కోట్లు  ఉంటే.. ఇప్పుడు ఒక్క తెలంగాణకు రూ.4,418 కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.  రూ.29 ,581 కోట్ల ప్రాజెక్ట్ లు తెలంగాణ లో పురోగతిలో ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతులు, అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. ఇక్కడి ప్రభుత్వం నుంచి సహకారం లేదని, ఒకవేళ ఉంటే.. కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయని చెప్పారు.

'తెలంగాణలో మరో 39 రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తాం. విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అంశం ఉంది. కాజీపేటలో రైల్వే వ్యాగన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు 521 కోట్లు కేటాయించాం. మొత్తం 160 ఎకరాలు కావాలి. 150 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చింది.  తెలంగాణలో 20 ఎంఎంటీఎస్ కొత్త ట్రైన్లు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మధ్య నడుస్తాయి. రైల్వేలను ప్రైవేటైజేషన్ చేసే ప్రసక్తే లేదు. తెలంగాణకు రెండు ఎక్సలేన్సీ కేంద్రాలు కేటాయించాం. కేటీఆర్ లెక్కలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సహకరించకపోవడం దురదృష్టకరం. కేంద్రం ఒంటరిగా అభివృద్ధి చేయలేదు.' అని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
చదవండి: స్పీడ్‌ పెంచిన కాంగ్రెస్‌.. ముఖ్యనేతలతో మాణిక్‌రావు ఠాక్రే సమావేశం

మరిన్ని వార్తలు