అనుమానాస్పద స్థితిలో భార్య మృతి! భర్తే ఇలా చేశాడని..

10 Dec, 2023 09:35 IST|Sakshi

సాక్షి, మెద‌క్‌: అనుమానాస్పద స్థితిలో భార్య మృతి చెందగా భర్తే ఆమెను హత్య చేశాడని ఆరోపిస్తూ బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మిరుదొడ్డిలో శనివారం జరిగింది. మహిళ బంధువులు గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. మిరుదొడ్డికి చెందిన కమలాక‌ర్‌తో వర్గల్ మండలం గుంటి పల్లి గ్రామానికి చెందిన పద్మ(22)కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.

కొన్నాళ్లకు వారి మధ్య కలహాలు నెలకొనడంతో రెండు, మూడు సార్లు పెద్దలు నచ్చజెప్పారు. ఇటీవల అదనపు కట్నం తీసుకురావాలని భార్య పద్మను కమలాకర్ వేదించడంతో రెండు రోజులుగా వారి మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున పద్మ ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతి చెందింది. దీంతో ఆమె భర్తతో పాటు అత్తమాములు ఇంటి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పద్మ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. కమలాక‌ర్‌ని శిక్షించాల‌ని డిమాండ్‌ చేశారు.

సమాచారం తెలుసుకున్న గజ్వేల్ ఏసీపీ ఎం.రమేశ్, సిద్దిపేట రూరల్ సీఐ చేరాల్‌ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని క్లూస్ టీంతో పరిశీలించారు. ఆందోళ‌నకు దిగిన పద్మ బంధువులకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. పద్మ తండ్రి దుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ ఏసీపీ ఎం. రమేశ్ తెలిపారు.
ఇవి కూడా చ‌ద‌వండి: లిఫ్ట్ లేద‌న్నది గ‌మ‌నించ‌కుండా అడుగుపెట్ట‌డంతో.. తీవ్ర విషాదం!

>
మరిన్ని వార్తలు