నేడు ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’
సాక్షి, హైదరాబాద్: చీకటితో పాటే వెలుగు వస్తుంది.. కల్లోలం వెనుకే ప్రశాంతత ఉంటుంది.. కోవిడ్ అది నిరూపించింది. కొద్ది రోజుల క్రితం వరకు బెంబేలెత్తించిన మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దీంతో అన్ని రంగాలు తిరిగి గాడిన పడ్డాయి. ప్రజల మానసిక ఆరోగ్యంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. మానసిక ఆందోళన, కుంగుబాటు, ఆత్మహత్యాప్రవృత్తి వంటి కోవిడ్ వల్ల తలెత్తిన మానసిక రుగ్మతలు క్రమంగా తగ్గుతున్నట్లు మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహమ్మారి నియంత్రణ కోసం లాక్డౌన్ విధించడంతో ఒక్కసారిగా ప్రజాజీవనం అతలాకుతలమైంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు బ్రేక్ పడింది. కోవిడ్ బారిన పడిన వారిని ఒకరకమైన మానసిక భయాందోళనలు చుట్టుముట్టగా ఏ వైపు నుంచి ముప్పు ముంచుకొస్తుందోననేఆందోళన సాధారణ జనాన్ని వెంటాడింది.
ఇంటి నుంచి బయటకు వెళ్లినా, తిరిగి ఇళ్లు చేరుకొన్నా తమతో పాటే కోవిడ్ వచ్చిందేమోననే భయాందోళనకు గురయ్యారు. కానీ లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో పాటు అన్ని రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉద్యోగ, వ్యాపారాల కోసం జనం ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ దైనందిన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కోవిడ్ తర్వాత మానసిక ఆరోగ్యంలో మౌలికమైన మార్పులు వచ్చాయని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాధిక ఆచార్య అన్నారు.
అప్పుడు అలా..
ఇప్పుడు ఇలా..
ఆన్లైన్ పాఠాలతో పిల్లల కుస్తీ..
మార్పు వచ్చింది
నెల రోజులుగా మానసిక సమస్యలతో వచ్చే వారి సంఖ్య చాలా వరకు తగ్గింది. కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. చాలామంది కోవిడ్ భయంతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇప్పుడు ఆ భయం తొలగింది. కోవిడ్ను ఎదుర్కోగలమనే భరోసా వచ్చింది. – డాక్టర్ చల్లా గీత, మానసిక వైద్య నిపుణులు,మనోజాగృతి వ్యవస్థాపకులు.