పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి: గంగుల 

3 Jun, 2022 04:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ పదిరోజుల్లో పూర్తికానుందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. 6,579 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 7.7 లక్షల మంది రైతుల నుంచి రూ.8 వేల కోట్ల విలువైన 41.33 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గురువారం శ్వేతపత్రం విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకున్నా, అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొని 13.69 కోట్ల గన్నీబ్యాగులు సేకరించి, కొనుగోళ్లు సాగిస్తున్నట్లు తెలిపారు.

అకాల వర్షాలకు తడిసిన 15 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామని, గోడౌన్లు, ట్రాన్స్‌పోర్టు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. జిల్లాల అంచనాల ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో 7.11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉండగా, కోతలు పూర్తి కావలసిన ప్రాంతాల నుంచి 4.32 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని మొత్తంగా 11.43 ఎల్‌ఎంటీ ధాన్యం రావచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు