కూరగాయలు అమ్ముతున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

26 Jul, 2020 11:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అసలే పేదరికం.. కుటుంబం గడవడమే కష్టం. అంతలోనే కరోనా.. చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోయింది. తల్లిదండ్రులకు అసరాగా ఉంటునన్న ఆనందం ఆవిరైపోయింది. ఆపై ఆర్థికంగా ఇబ్బందులు. కానీ ఇవేమి ఆ పేదింటి ఆడబిడ్డను అంగుళం కదిలించలేకపోయాయి. ఈ కరోనా కాలంలో వచ్చిన కష్టాలతో కుంగిపోలేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోతేనేం కూరగాయలమ్మి కుటుంబానికి అండగా ఉంటాననని నడుం బిగించింది ఓరుగల్లు పోరుబిడ్డ శారద. ఉద్యోగం కోల్పోయిన ఏ మాత్రం వెనకడుగు వేయకుండా స్వశక్తితో కుటుంబాన్ని పోషించేందుకు కూరగాయలు అమ్ముతూ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. కూరగాయలను అమ్ముతున్నందుకు ఏ మాత్రం నామోషి పడటం లేదంటోంది యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.

దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్లు సాప్ట్‌వేర్‌ ఉద్యోగినిగా విధులు నిర్వర్తించిన శారద ఇటీవల హైదరాబాద్‌లో కొత్త జాబ్‌లో జాయిన్‌ అయ్యారు. మంచి వేతనంతో తొలి మూడు నెలల పాటు ట్రైనింగ్‌ పూర్తి చేసిన ఆమెకు.. కరోనా వెంటాడింది. లాక్‌డౌన్‌ విధించడంతో కంపెనీ యాజమన్యం ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. దీంతో ఎలాంటి కుంగుబాటకు గురికాని శారద.. తల్లిదండ్రులకు తోడుగా కూరగాయల వ్యాపారం ప్రారంభించింది. ఉద్యోగం కోల్పోయి మానసిన వేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్న ఎంతోమందికి ఆదర్శంగా ఉంటున్న యువ సాప్ట్‌వేర్‌ను ‘సాక్షి’ పలకరించింది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఆమె మాటలపై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శభాష్‌ తల్లీ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

కాగా దేశంలో రోజు రోజుకరూ నిరుద్యోగం పెరిగిపోతోంది. కరోనా కారణంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో కూలీలు ఉపాధికి దూరమయ్యారు. వివిధ రంగాల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా వైరస్ దేశానికి ఆర్థికంగా తీవ్ర నష్టం చేస్తోంది. ముఖ్యంగా లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి దేశంలో పేద, సామాన్య ప్రజలు దిక్కులేనివారయ్యారు. అప్పటివరకూ కూలీనాలీ చేసుకొని బతికేవారంతా రోడ్డున పడ్డారు. లాక్‌డౌన్‌ను అంతకంతకూ పొడిగిస్తుంటే... మరింత మంది ఉద్యోగాలు పోతున్నాయి. ఫలితంగా ఇప్పటికే దేశంలో 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. దేశంలో నిరుద్యోగం 27.1 శాతానికి చేరిందని తేలింది.

మరిన్ని వార్తలు