ఏడడుగుల బంధానికి ఏడేళ్ల గుర్తుగా.. చెట్టుకి పుట్టినరోజు..

30 Jul, 2023 07:20 IST|Sakshi

వికారాబాద్‌: ఆలుమగల అనుబంధానికి గుర్తుగా మిగిలింది ఆ వృక్షం. భర్త బతుకున్న రోజుల్లో కలిసి నాటిన మొక్క నేడు మానువైనా.. మనువాడినవాడికి తీపపిగుర్తుగా మలచుకొని.. ఆ పచ్చని చెట్టువద్దే ఏటా అతడి జన్మదిన వేడుకలు నిర్వహిస్తోంది ఓ ఇల్లాలు.తాండూరు మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, వెంకటయ్య భార్యభర్తలు. ఏడేళ్ల క్రితం వెంకటయ్య జన్మదినం సందర్భంగా చించోళి రోడ్డు మార్గంలో ఉన్న వారి నివాసం ఎదుట ఇద్దరూ కలిసి ఓ మొక్క నాటారు.

ఏడాది తర్వాత వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. నాటి నుంచి కుటుంబసభ్యులతో కలిసి ఆ చెట్టువద్దే వెంకటయ్య జయంతి వేడుకలు నిర్వహించే వారు. రోడ్డు విస్తరణలో భాగంగా చెట్టును అక్కడి నుంచి తొలగించాల్సి రావడంతో వేర్లతో సహా చెట్టును తీసుకెళ్లి తాండూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో నాటారు. కాగా శనివారం భర్త వెంకటయ్య జయంతి కావడంతో అదే చెట్టు వద్ద భార్య, బంధువులు వేడుకలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు