గుప్తనిధుల కోసం 20 అడుగుల గొయ్యి!

19 Dec, 2023 11:59 IST|Sakshi

విశాఖపట్నం: ఓ వ్యక్తి తన ఇంటి వద్ద గుప్తనిధులు ఉన్నాయని 20 అడుగుల గొయ్యి తవ్వినట్టు కంచరపాలెం ఐదో పట్టణ పోలీసులకు సమాచారం అందింది. పోటీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కంచరపాలెం ధర్మానగర్‌ రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్న కోటేశ్వరరావు అనే వ్యక్తి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు.

నెల రోజుల నుంచి అతని ఇంటి ముందు తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విజయవాడకు చెందిన పలువురు వచ్చి గుప్తనిధుల కోసమే ఈ గొయ్యి తవ్వుతున్నారని వివరించారు. విషయం బయటకు పొక్కడంతో గేట్లకు తాళాలు వేశారని పేర్కొన్నారు. కంచరపాలెం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేశారు. వాస్తు బాగోలేక ఈ తవ్వకాలు చేపట్టినట్లు కోటేశ్వరరావు చెప్పాడు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు