బిస్కెట్‌ ప్యాకెట్‌ కొనుక్కొని వస్తుండగా.. ఘోర ప్ర‌మాదం!

19 Dec, 2023 11:44 IST|Sakshi
సోనుకుమార్‌, రంజన్‌ అలీ(ఫైల్‌)

గుర్తు తెలియని వాహనం ఢీ

ఓ వ్యక్తి, నాలుగేళ్ల బాలుడు మృతి

పటాన్‌చెరులో ఘటన

పటాన్‌చెరు: బిస్కెట్‌ ప్యాకెట్‌ కొనేందుకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తితోపాటు నాలుగేళ్ల బాలుడు చెందాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన అబేద్‌ అలీ బతుకుదెరువు కోసం పటాన్‌చెరు మండలం ముత్తంగికి వలస వచ్చాడు. స్థానికంగా ఉన్న వేంకటేశ్వర బ్రిక్స్‌ కంపెనీలో పని చేసుకుంటూ పక్కనే గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరు పనిచేసే చోట బీహార్‌కు చెందిన సోనుకుమార్‌ అలియాస్‌ మునిలాల్‌(38) పని చేసుకుంటూ అక్కడే గుడిసెలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఆదివారం రాత్రి సోనుకుమార్‌, అబేద్‌ అలీ కుమారుడు రంజన్‌ అలీ(4)ని తీసుకొని బిస్కెట్‌ ప్యాకెట్‌ కొనేందుకు దుకాణానికి రోడ్డు దాటి వెళ్లాడు. బిస్కెట్‌ ప్యాకెట్‌ తీసుకొని తిరిగి రోడ్డు దాటుతుండగా పటాన్‌చెరు వైపు నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలై సోనుకుమార్‌, బాలుడు రంజన్‌ అలీ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవి చ‌ద‌వండి: వివాహమైన రెండేళ్లకే నూరేళ్లు! అనాథగా తొమ్మిదినెలల కుమారుడు..

>
మరిన్ని వార్తలు