గురువారం శ్రీ 9 శ్రీ నవంబర్ శ్రీ 2023
మావుళ్లమ్మ సన్నిధిలో మంత్రి రజిని
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం మావుళ్లమ్మవారిని బుధవారం ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఆమెకు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఆమె ఆలయంలో అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ మంత్రికి వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ, ధర్మకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
భీమవరం (ప్రకాశం చౌక్): రానున్న సాధారణ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లకు సన్నద్ధం చేస్తున్నట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. బుధవారం ఆమె భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, నరసాపురం వైఎన్ కళాశాల, ఉండిలో మార్కెట్ యార్డులను ఆమె పరిశీలించారు. ఎన్నికల సామగ్రి భద్రపరచడం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు, శిక్షణా తరగతులు నిర్వహణకు అనువైన భవనాలతో పాటు జిల్లాలో ఎన్నికల అనంతరం ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరచడానికి స్ట్రాంగ్ రూములను, ఓట్ల లెక్కింపునకు అనువైన భవనాలను జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. భీమవరంలో రెండు కళాశాలల్లో పీజీ సెంటర్, సెమినార్ రూమ్, ఆడిటోరియం, విష్ణు కాలేజీ పబ్లిక్ స్కూల్, అన్నపూర్ణ క్యాంటీన్, సీతా పాలిటెక్నికల్ కళాశాల తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రత, శానిటేషన్, పార్కింగ్ ఏర్పాట్లపై సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎన్నికలు అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. భవనాలు ఖరారు చేసిన అనంతరం నివేదికను సిద్ధం చేసి ఎన్నికల సంఘానికి నివేదిస్తామన్నారు. ఆర్డీఓ శ్రీనివాసులురాజు, తహసీల్దార్ రవికుమార్, రెవెన్యూ, సర్వే సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
పీఆర్ 126 రకం సాగు చేయొద్దు
సాక్షి, భీమవరం: జిల్లాలో రానున్న దాళ్వా సీజన్లో పీఆర్–126 రకం వరి వంగడం సాగు చేయవద్దని కలెక్టర్ పి.ప్రశాంతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పలువురు ఈ రకాన్ని సాగుచేయడానికి సన్నద్ధమవుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని, అయితే ఈ రకాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయనందున రైతులు ప్రైవేటుగా అమ్ముకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దాళ్వాలో వెదజల్లు పద్దతి మేలని ఆమె సూచించారు.
ఉమ్మడి జిల్లాలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిగోదావరి జిల్లాలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా టెలికాం జనరల్ మేనేజర్ ఎల్.శ్రీను తెలిపారు. స్థానిక టెలికాం కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 6న తాడేపల్లిగూడెంలోని నిట్ కాలేజీలో 4జీ సేవలను ఆంధ్రప్రదేశ్ టెలికాం చీఫ్ జనరల్ మేనేజర్ చేతులమీదుగా ప్రారంభించామన్నారు. ఉమ్మడి జిల్లాలో నిట్ కాలేజీ లో రెండు 4జీ టవర్లు ప్రారంభించామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా టెలికాం జనరల్ మేనేజర్ పి.రాజు, నిట్ కాలేజ్ రిజిస్ట్రార్ పి.దినేష్ శంకర్రెడ్డి, జనరల్ మేనేజర్లు ఎ.శ్రీనివాసరావు, వై.రవీంద్రనాథ్ పాల్గొన్నారన్నారు.
16న ఉప సర్పంచుల ఎన్నిక
కై కలూరు: పంచాయతీ పాలకవర్గాల్లో ఖాళీగా ఉన్న ఉప సర్పంచుల ఎన్నిక ఈనెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లాలో చిట్టవరం (నరసాపురం), కాశిపాడు (గణపవరం), మెట్ట ఉప్పర గూడెం (తాడేపల్లిగూడెం), ఏలూరు జిల్లాలో ఆడమిల్లి (కామవరపుకోట), తామరకొల్లు (కై కలూరు), నారాయణపురం (ఉంగుటూరు)లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.
సాధికార సంతకం
● పాలకొల్లులో కదం తొక్కిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు
● వైఎస్సార్ సీపీ సామాజిక సాధికార యాత్రకు విశేష స్పందన
● పల్లెల నుంచి భారీగా తరలిన ప్రజలు
● బస్సు యాత్రకు అడుగడుగునా ఘన స్వాగతం
● జన సంద్రంగా మారిన క్షీరపురి
సాక్షి ప్రతినిధి, ఏలూరు/పాలకొల్లు సెంట్రల్ : పాలకొల్లు నియోజకవర్గంలోకి వచ్చిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గంలోని ప్రతి పల్లె నుంచి తరలివచ్చిన అశేష జనవాహినితో క్షీరపురి అయిన పాలకొల్లు జనసంద్రంగా మారింది. భారీ ర్యాలీతో ప్రధాన సెంటర్కు బస్సు యాత్ర చేరుకుంది. దివంగత మహనీయుల చిత్రపటాలకు నివాళి అర్పించి వైఎస్సార్ సీపీ సంక్షేమ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా జరిగిన మేలును మంత్రులు, ప్రజాప్రతినిధులు వివరించారు. బుధవారం పాలకొల్లులో వైఎ స్సార్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభ నియోజకవర్గ సమన్వయకర్త గుడాల గోపి నేతృత్వంలో ఘనంగా జరిగింది.
క్షీరారామంలో పూజలు చేసి..
పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానం వద్ద ఉదయం బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామచంద్ర గార్డెన్స్ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర కెనాల్ రోడ్డు మీదుగా గాంధీ బొమ్మసెంటర్ వరకూ సాగింది. సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉన్నా అశేష జనవాహిని తరలిరావడం, భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికిన క్రమంలో దాదాపు 45 నిమిషాలపాటు ర్యాలీ కొనసాగింది. గాంధీ బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ వేదిక నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రసంగించి చంద్రబాబు పాలనకు, సీఎం జగన్ పాలనకు ఉన్న తేడాను గణాంకాలతో సహా ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, ఎంపీ నందిగం సురేష్, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఎంపీ, ఉభయగోదావరి జిల్లాల పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ మిఽథున్రెడ్డి, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్ల ఏడు నెలల కాలంలో సీఎం జగన్ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జరిగిన మేలును వివరిస్తూ మంత్రులు సుదీర్ఘంగా ప్రసంగించారు.
క్షీరపురి.. జనఝరి : పాలకొల్లు సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. చిరుజల్లుల్లోనే ముఖ్య నాయకులంతా ప్రసంగించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ సభ జరగడంతో వైఎస్సార్సీపీ కేడర్లో నూతనోత్సాహం నెలకొంది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ నందిగం సురేష్ చంద్రబాబు తీరుపై, గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు టీడీపీ చేసిన మోసాలను వివరించడంతో పెద్దెత్తున స్పందన లభించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం, దెందులూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే బస్సు యాత్ర విజయవంతం అయ్యింది. టీటీడీ పాలక మండలి సభ్యుడు మేకా శేషుబాబు, ఎస్సీ కమిషన్ సభ్యుడు చెల్లెం ఆనంద ప్రకాష్, పార్టీ నేత గుణ్ణం నాగబాబు, గంటా ప్రసాద్, యడ్ల తాతాజీ, గుడూరి ఉమాబాల, మంతెన యోగీంద్రకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, పెండ్ర వీరన్న, గుబ్బల తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
సభ సైడ్లైట్స్
● మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
● వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి స్టేజీ మీదకు వచ్చి రెండు చేతులు జోడించి సభికులకు నమస్కరించడంతో కార్యకర్తలు కేరింతలు కొట్టారు.
● పాలకొల్లు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు టోపీలు, జెండాలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
● మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
● విద్యార్థుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
● తెలంగాణ గాయకులు వైఎస్సార్, సీఎం జగన్ పథకాలపై పాటలు పాడి అలరించారు.
● తప్పెట గుళ్లు కళాకారుల ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది.
● నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో పాటు పట్టణవ్యాప్తంగా ప్రజలు, పార్టీ శ్రే ణులు తీన్మార్ డప్పులతో భారీ ర్యాలీగా సభా వేదిక వద్దకు చేరుకున్నారు.
● మంత్రుల ఉత్తేజపూరిత ప్రసంగాలతో సభికులు జయజయధ్వానాలు పలికారు.
పక్కాగా
స్వమిత్వ సర్వే
భీమవరం (ప్రకాశం చౌక్): స్వమిత్వ సర్వే ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టరు ఎస్.రామసుందర్రెడ్డి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో మూడో విడత సర్వే ప్రక్రియపై 24 గ్రామాలకు సంబంధించిన సచివాలయ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, మండల యూపీఆర్డీలకు బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వేను స్నేహపూరిత వాతావరణంలో పటిష్టంగా నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరికీ నోటీసులు జారీ చేసి వారి సమక్షంలోనే సర్వే చేయాలన్నారు. అనుమానాలకు, వివాదాలకు తావులేకుండా ప్రక్రియ సాగాలన్నారు. ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం భూములు సర్వే చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆస్తి అనుభవిస్తున్న వారికి యాజమాన్య హక్కు పత్రాలు అందజేయాలని తెలిపారు. అలాగే ప్రైవేటు ఇల్లు స్థలాలు పక్కాగా సర్వే చేయాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి జీవీకే మల్లికార్జునరావు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా, ఈవోపీఆర్డీలు తదితరులు పాల్గొన్నారు.
న్యూస్రీల్
సంక్షేమానికి పెద్దపీట
పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గంలో భారీ మెజార్టీ సాధించి వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తామన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో నాడు పాలకొల్లు ప్రజలను వంచిస్తే నేడు సీఎం జగన్మోహన్రెడ్డి మెడికల్ కాలేజీతో సహా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు.