భువనగిరిటౌన్ : రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని, ప్రజల కు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్కుమార్రెడ్డి, కర్నాటక ఎమ్మెల్యే రిజ్వన్ పేర్కొన్నారు. శనివారం భువనగిరిలోని వైఎస్సార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ సర్కార్ ముస్లింలకు ఇచ్చిన ఏఒక్క హామీ అమలు చేయలేదన్నారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారని విమర్శించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందజేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోవడం మొదలైందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం తగ్గుతుందన్నారు. భువనగిరి ఖిలాపైనా కాంగ్రెస్ జెండా ఎగురవేసి చరిత్ర లిఖించబోతున్నామని చెప్పారు. కాంగ్రెస్ గెలుపునకు పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని, ఆరు గ్యారంటీ స్కీంలను గడపగడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు ఎండీ జలీల్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఉజ్మషాకేరా, సలీం, కుంభం కీర్తిరెడ్డి, శ్రీరాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు రఫీయోద్దీన్, మజహార్, సలావుద్దీన్, అవైస్చిస్తీ, షరీప్,అబేద్లీ, రాషేద్హుస్సెన్, బాబా, అమనత్వుల్లా, లాయిఖ్అహ్మద్, పాయాజ్, కౌసర్ తదితరులు పాల్గొన్నారు.
సమ్మేళనంలో పాల్గొన్న ముస్లిం మహిళలు