పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కుంభకోణంలో కీలక నిందితుడు, ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ మేనమామ, మెహుల్ చోక్సీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ రంగ బ్యాంకు పీఎన్బీలో రూ.14\వేల కోట్లు ఎగవేసి భారీ కుంభకోణానికి పాల్పడి ఆంటిగ్వా పారిపోయి, అక్కడి పౌరసత్వంతో ఎంజాయ్ చేస్తున్న చోక్సీపై దొంగ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంటిగ్వాఅండ్ బార్బుడా ప్రధాని గాస్టన్ బ్రౌన్. ఫ్యుజిటివ్ బిలియనీర్ మెహుల్ చోక్సీ ఒక మోసగాడు, వంచకుడు అని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని తెలిపారు. సాధ్యమైనంత త్వరలోనే చోక్సిని బహిష్కరిస్తాం..అతన్ని తిరిగి భారతదేశానికి రప్పించుకోవచ్చన్నారు. చోక్సీ ద్వారా దేశానికి ఉపయోగంలేదనీ, త్వరలోనే చోక్సి పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంటామని ఆయన స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో భారతీయ అధికారులు ఎప్పుడైనా వచ్చి చోక్సీని విచారించవచ్చు అని ప్రధాని గాస్టన్ తెలిపారు. అతనిపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చన్నారు. అంతేకాదు మంచి వ్యక్తిగా చోక్సిని భారత అధికారులు క్లియర్ చేయడం దురదృష్టకరమని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు భారత అధికారులే బాధ్యత వహించాలని కూడా చురకలంటించారు.
కాగా పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే డైమండ్ వ్యాపారులు నీరవ్ మోదీ, చోక్సీ విదేశాలకు పారిపోయారు. అయితే వీరి పాస్పోర్టులను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, నిందితులను తిరిగి దేశానికి రప్పించేందుకు మల్లగుల్లాలు పడుతోంది. నీరవ్ ప్రస్తుతం లండన్ జైల్లో ఉండగా, అతని రిమాండ్ను అక్టోబర్ 17 వరకు పొడిగించింది లండన్ కోర్టు. తాను నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణలు తప్పుడివి అంటున్న చోక్సీ గతంలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఒక సందర్బంగా ఆంటిగ్వా ప్రభుత్వం చోక్సీని సమర్ధించింది కూడా. అలాగే అనారోగ్యం సాకుతో విచారణకు ఎ గ్గొడుతూ, మూక హత్యలు కారణంగా తాను ఇండియాకు రాలేనంటూ చిలక పలుకులు పలుకుతున్న చోక్సీ, జూన్ 2018 లో ముంబై అవినీతి నిరోధక కోర్టులో దాఖలు చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బిడబ్ల్యు) రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.