సాక్షి, ముంబై: ముక్కుసూటి మనిషి అయిన దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్కు నాన్చటం తెలీదు. ఏ విషయంపైన అయినా సరే చాలా ఓపెన్గా మాట్లాడుతుంటారు. ట్వీటర్లో ఆయన చేసే పోస్టులు కూడా సరదాగా. తాజాగా అవెంజర్స్ ఇన్ఫినిటీ చిత్రాన్ని చూసిన ఆయన ఓ ట్వీట్ చేశారు.
‘సర్.. తప్పుగా అనుకోకండి. అవెంజర్స్ సినిమా చూశా. కానీ, సినిమా చూస్తున్నంత సేపు ఏం జరుగుతుందో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు’ అంటూ సరదాగా ఓ ట్వీటేశారు. దానికి స్పందించిన అవెంజర్స్ ఫ్యాన్స్ ఆయనికి కౌంటర్ ఇచ్చే యత్నం చేశారు. ‘అవెంజర్స్ సిరీస్లో వరస బెట్టి సినిమాలన్నీ చూస్తే మీకు అసలు విషయం అర్థమౌతుంది’ ఆయన ఓ వ్యక్తి ట్వీట్ చేయగా.. ‘ ఈ విషయంలో మీ కంటే మీ మనవరాలు ఆరాధ్య బెటర్. ఆమెకు సినిమా బాగా అర్థమై ఉంటుంది’ అంటూ మరో వ్యక్తి సెటైర్ పేల్చాడు. చిన్న పిల్లలకు ఆ సూపర్ హీరోస్ గురించి బాగా తెలుసని, కాబట్టి మీ ముద్దుల మనవరాలిని అడిగి కథ మొత్తం తెలుసుకోవాలని మరో వ్యక్తి ట్వీట్ చేశారు. సరదాగా మెగాస్టార్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ డాలర్ల వసూళ్లు చేసిన ఈ చిత్రం ఇండియాలో రూ.230 కోట్లు వసూలు చేసింది. ఇన్ఫినిటీ స్టోన్స్ సాయంతో సగం విశ్వాన్ని నాశనం చేయాలని యత్నించే థానోస్, అతన్ని అడ్డుకునేందుకు అవెంజర్స్ చేసే పోరాటలతో ఇన్ఫినిటీ వార్ తెరకెక్కింది.