గరుడవేగ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం కల్కి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అ! ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్లో పది రోజుల కిందట రాజశేఖర్ గాయపడ్డారు. అయితే చాలా మంది నటీనటులు కాంబినేషన్లో షూటింగ్ ఉండటంతో రెస్ట్ తీసుకోకుండానే ఆ షెడ్యూల్ను పూర్తి చేశారు.
కొద్ది రోజుల గ్యాప్ తరువాత ప్రస్తుతం మరో మేజర్ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ కులుమానాలీ వెళ్లారు. అయితే అక్కడ మరోసారి రాజశేఖర్ ప్రమాధానికి గురైనట్టుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై హీరో రాజశేఖర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.‘చిన్న అడ్డంకి కారణంగా ప్రయాణం కాస్త ఆలస్యమైంది అంతే ఎలాంటి ప్రమాదం జరగలేదు. కులుమనాలీలో జరగబోయే షెడ్యూల్కు రెడీ అవుతున్నాను. నా క్షేమాన్ని కోరుతూ ఎంతో మంది మెసేజ్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్స్’ అంటూ ట్వీట్ చేశారు.