పాటలు, రొమాన్స్ లేకుండా కేవలం యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో తెరకెక్కిన కార్తీ తాజా చిత్రం ‘ఖైదీ’. రెగ్యూలర్ సినిమాలకు భిన్నంగా రూపొందిన ఈ సినిమా హిట్గా నిలవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా సూపర్స్టార్ మహేష్ బాబు సైతం ‘ఖైదీ’పై ప్రశంసల వర్షం కురిపించాడు. సరికొత్తగా తెరకెక్కుతున్న నవ యుగపు సినిమాలకు ఖైదీని ఉదాహరణగా పేర్కొన్న ప్రిన్స్... పాటల్లేకుండానే గ్రిప్పింగ్ స్క్రిప్టుతో ప్రేక్షకులను కట్టిపడేసిందని కొనియాడాడు. ఇది ఆహ్వానించదగ్గ మార్పు అంటూ ఖైదీ టీంను ట్విటర్ వేదికగా అభినందించాడు.(చదవండి : ఖైదీ సినిమా ఎలా ఉందంటే..)
కాగా దర్శకుడు అవ్వాలన్న కోరికతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కార్తీ... యుగానికొక్కడు, ఆవారా, నా పేరు శివ, ఊపిరి, ఖాకీ సినిమాలతో కోలీవుడ్లో హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. విభిన్న కథాంశాలతో రూపొందిన ఈ సినిమాలన్నీ తెలుగులోనూ విడుదల కావడంతో టాలీవుడ్లో కూడా కార్తీకి మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక కింగ్ నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ సినిమాలో నటించిన కార్తి.. గత శుక్రవారం ఖైదీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రకాష్బాబు, ఎస్.ఆర్. ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ విడుదల చేశారు.