సినీ ఇండస్ట్రీలో సంచలనాలకు మారుపేరు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్గోపాల్ వార్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పవర్ స్టార్’. ఈ లాక్డౌన్ కాలంలో క్లైమాక్స్, నగ్నం వంటి చిత్రాలను ఓటీటీ వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అమృత, మారుతీరావుల కథ ఆధారంగా మర్డర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మర్డర్తో పాటు ‘కరోనా వైరస్’, ‘ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ’, ‘కిడ్నాప్ ఆఫ్ కత్రినా కైఫ్’ చిత్రాలను చేస్తున్నారు. తాజాగా ‘పవర్ స్టార్’ పేరుతో ఓ చిత్రం చేయబోతున్నట్లు ఆదివారం ట్విటర్ వేదికగా ఆర్జీవీ ప్రకటించి మరో సంచలనానికి తెరలేపారు. (ఆర్జీవీ ‘మర్డర్’: మరో పోస్టర్ వైరల్)
అయితే ఆర్జీవీ దగ్గర కథలు అయిపోవడంతోనే నిజ జీవిత కథలు, సంఘటనలపై పడ్డారని పలువురు విమర్శిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ‘నా కాలేజీలో జరిగిన కథనే శివ. గాయం, సర్కార్, సత్య, కంపెనీ, రక్తచరిత్ర ఇవన్నీ నిజ జీవిత కథల ఆధారంగానే తెరకెక్కించిన చిత్రాలు. నా మొత్తం సినీ కెరీర్లో 70 శాతం చిత్రాలు సమాజంలో జరిగిన ఘటనలు, నిజ జీవిత అనుభవాల ఆధారంగానే తెరకెక్కించాను. మరికొన్ని ఇంగ్లీష్ నవలలు, ఫారిన్ చిత్రాల నుంచి కాపీ కొట్టాను’ అంటూ ఆర్జీవీ కుండబద్దలు కొట్టి చెప్పారు. ప్రస్తుతం ఆర్జీవీ సమాధానం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. (వర్మ కొత్త సినిమా: పవర్ స్టార్ ఇతనే)