కేరళ వరద బాధితులను ఆదుకోవడం కోసం ఎందరో ముందుకు వస్తున్నారు. వీరిలో సిని పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కేరళ వాసులకోసం విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీరందరిలోకి అతి ‘భారీ విరాళా’న్ని ప్రకటించిన హీరో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. సల్లు భాయ్ కేరళ బాధితుల కోసం ఏకంగా 12 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించినట్లు నటుడు జావేద్ జాఫెరీ తన ట్విటర్లో తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ అభిమానులు ఆయన మంచి మనసును అభినందిద్దామనుకునేలోపే జావేద్ ఆ ట్వీట్ని డిలీట్ చేశారు.
దాంతో అభిమానుల్లో గందరగోళం మొదలయ్యింది. అనంతరం జావేద్ మరో ట్వీట్ చేశారు. ‘కేరళ వరద బాధితుల కోసం సల్మాన్ ఖాన్ 12 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారనే వార్తను నేను కేవలం విన్నాను అంతే. సల్మాన్ లాంటి సూపర్ స్టార్కి అది ఏమంత పెద్ద విషయం కాదు. అలానే బాధితులను ఆదుకోవడంలో సల్మాన్ ఖాన్ ఎప్పుడు ముందే ఉంటారు కాబట్టి వెంటనే ఈ విషయం గురించి ట్వీట్ చేశాను. అయితే ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక సమాచారం నాకు తెలియదు’ అంటూ జావేద్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ 1 కోటి రూపాయలను విరాళంగా ప్రకటించగా, ‘గోల్డ్’ నటుడు కునాల్ కపూర్ రూ. 1.2 కోట్లను విరాళంగా ప్రకటించారు. మరో నటుడు రణ్దీప్ హుడా వాలంటీర్లతో కలిసి కేరళలోని ఖల్సా ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొనడమే కాక బాధితులకు స్వయంగా ఆహారం వండి పెట్టారు.