గువహటి : అస్సాంలో వరదల ఉదృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ర్టంలో భారీ వర్షాలు, వరదల వల్ల ఇప్పటి వరకు మరణించిన వారిసంఖ్య 104కు చేరుకుంది. వీరిలో కొండచరియలు విరిగపడి 26 మంది చనిపోయారు. వీరిలో శుక్రవారం ఒక్కరోజే ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ర్టంలోని 33 జిల్లాలకు గానూ 28 జిల్లాల్లో వరద భీభత్సం సృష్టిస్తోంది. దీంతో దాదాపు 40 లక్షలమంది నిరాశ్రయులు అయ్యారు. రోజురోజుకు పెరుగుతున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే 1.3 లక్షల హెక్టార్ల పంట నాశనమైనట్లు అధికారులు పేర్కొన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉందని, మరణాల సంఖ్య కూడా అధికంగా ఉందని అస్సాం స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏఎస్డీఎంఏ)దృవీకరించింది.
(శభాష్ ఎమ్మెల్యే, నీటిలోకి దిగి మరీ...)
ఇప్పటివరకు 303 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి సుమారు సుమారు 50 వేల మందికి పైగా ప్రజలకు ఆశ్రయం కల్పించి నిత్యవసరాలను అందిస్తున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బ్రహ్మపుత్రా నది ప్రమాదకరస్థాయి దాటి ప్రవహిస్తోంది. దీంతో సమీప గ్రామాలన్నీ నీటమునిగాయి. ముంపు ప్రాంతాల్లో బాధితుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి . వరద బాధితుల కోసం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 445 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. (భారత్కు రూ.10 లక్షల కోట్ల నష్టం!)