సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భారత ఆర్మీ దళాలు కశ్మీరీలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయంటూ విద్యార్థిని నాయకురాలు, స్థానిక యువతి షెహ్లా రషీద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై భారత ఆర్మీ తీవ్రంగా స్పందించింది. ఆమె వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమని, కశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాయని స్పష్టంచేసింది. షెహ్లా వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపింది. అయితే భారత ఆర్మీపై ఆమె చేసిన పోస్ట్ వివాదంగా మారడంతో ప్రముఖ న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ సుప్రీకోర్టులో క్రిమినల్ కేసును నమోదు చేశారు.
భారత ప్రభుత్వంపై, ఆర్మీపై నిరూపణలేని ఆరోపణలు చేశారని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కశ్మీర్ మూవ్మెంట్ నాయకురాలైన షెహ్లా రషీద్ కశ్మీర్ విభజనపై సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఫేస్బుక్లో ఎప్పుడూ యాక్టీవ్గా ఉండే ఆమె కశ్మీర్లో ఆర్మీ అధికారులను ప్రజలను చిత్రహింసలను గురిచేస్తున్నారని ఆరోపించారు. యువకులను అర్థరాత్రి సమయంలో ఇంట్లో నుంచి బలవంతగా తీసుకెళ్తున్నారని, పలువురిని గృహనిర్భందానికి గురిచేస్తున్నారని పోస్ట్ చేశారు.