ముంబై : బలపరీక్షకు ముందే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన భార్య అమృత ఫడ్నవీస్ కవితాత్మక ధోరణిలో ట్వీట్ చేశారు. త్వరలోనే వసంతం తిరిగివచ్చి కొమ్మలపై సువాసనను వెదజల్లుతుందని, ఇది శరధ్రుతువని వాతావరణంలో మార్పు కోసం వేచిచూస్తామని అమృత ఫడ్నవీస్ హిందీలో ట్వీట్ చేశారు. ఐదేళ్లుగా మీరు నాపై చూపిన ప్రేమ ఎప్పటికీ గుర్తుంటుందని, అందుకు మహారాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలని పేర్కొన్నారు. ప్రజలకు తన సాధ్యమైనంత మేర సానుకూల మార్పు దిశగా పనిచేసేందుకు తాను ప్రయత్నించానని ఆమె చెప్పుకొచ్చారు. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా బలపరీక్ష ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన క్రమంలో 80 గంటల పాటు సీఎం పదవిలో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేయడంతో మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరేందుకు మార్గం సుగమమైంది.