శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో మరోసారి అలజడి రేగింది. ఉగ్రవాదులు పెట్టిన బాంబును నిర్వీర్యం చేసే క్రమంలో ఓ ఆర్మీ మేజర్ మృతిచెందగా.. ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. కశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వాస్తవాధీన రేఖ(ఎల్వోసీ) వద్ద పెట్రోలింగ్ చేస్తున్న భద్రత బలగాలకు రాజౌరీలోని నౌషీరా సెక్టారు వద్ద బాంబు పెట్టిన ఆనవాళ్లు కనిపించాయి.
ఈ క్రమంలో అక్కడ అత్యాధునిక పేలుడు పదార్థం(ఐఈడీ) ఉండటం గమనించిన ఆర్మీ అధికారి దానిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బాంబు ఒక్కసారిగా పేలడంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో పక్కనే ఉన్న జవాను కూడా తీవ్రంగా గాయపడినట్లు లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ పేర్కొన్నారు. కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో భద్రత కట్టుదిట్టం చేసే అంశమై చర్చలు కొనసాగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.