సాక్షి, న్యూఢిల్లీ : నిరుపేదలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నేరుగా డబ్బు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తప్పు బట్టారు. ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పేదలకు తక్షణమే 10వేల రూపాయలు అందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలపై కరోనా చూపిన ప్రభావాలను వివరించిన ఓ వార్తా నివేదికను రాహుల్ ట్విటర్లో షేర్ చేశారు. (బ్లాక్ మార్కెటింగ్ విషయలో కఠినంగా ఉంటాం )
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల మధ్య పరిశ్రమలు గట్టెక్కాలంటే కేంద్రం ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని రాహుల్ పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రజలు, పరిశ్రమలకు నేరుగా డబ్బు అందించడాన్ని నిరాకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నేరమని రాహుల్ అభివర్ణించారు. భారత్లో కరోనా కట్టడి కోసం మోదీ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ఎలా విఫలం అయ్యిందో గ్రాఫ్లతో సహా వివరిస్తూ ట్విటర్లో పంచుకున్నారు. దేశంలో కేసులు పెరుగుతుంటే భారీ సడలింపులు ఇవ్వడంపై ఆనాడే ప్రశ్నించిన విషయాన్ని రాహుల్ గుర్తుచేశారు. (కరోనా ఎఫెక్ట్: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం)