సాక్షి, న్యూఢిల్లీ: మీటూ పేరుతో సాక్షాత్తూ కేంద్రమంత్రిపై లైంగిక ఆరోపణలు చేసి జర్నలిస్టు ప్రియా రమణికి దేశవ్యాప్తంగా మహిళా జర్నలిస్టులనుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఏకంగా 97మంది లాయర్ల సహకారంతో క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేయడంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా 14మందికిపైగా మహిళల ఆరోపణలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏమీ పట్టించుకోలేదు. మంత్రిపై ఎలాంటి చర్యల్ని ప్రకటించలేదు. కనీస విచారణ చేపడతామన్న మాటకూడా మాట్లాడలేదనీ ఇది శోచనీయమని విమర్శించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా అక్బర్ తీసుకున్న చర్య విస్తుగొల్పిందని దుయ్యపట్టారు. 14మంది మహిళలు ఆరోపణలు చేస్తే కేవలం ప్రియా రమణిపైనే ఎందుకు కేసులని కామిని జైశ్వాల్ ప్రశ్నించారు. దీని వెనుక పెద్దకుట్ర దాగా వుందని ఆరోపించారు.
మరోవైపు పరువు నష్టం దావాపై ప్రియా రమణి కూడా ట్విటర్ లో స్పందించారు. దీనిపై పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సత్యమే తనకు రక్షణ అని పేర్కొన్నారు. అనేక మంది మహిళలు అతడిపై చేసిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేవలం తనను మాత్రమే బెదిరించడం వేధింపుల ద్వారా వారి నోరు మూయించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.
పలు మహిళా జర్నలిస్టు సంఘాలు తాజా పరిణామంపై తీవ్ర ఆగ్రహాన్నివ్యక్తం చేశాయి. తక్షణమే అక్బర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ప్రియా మరణి రమణికి మద్దతుగా దేశాధ్యక్షుడు రామ్ నాద్ కోవింద్కు, ప్రధానమంత్రి నరేంద మోదీకి లేఖ రాస్తూ ఒక ప్రకటన విడుదల చేశాయి. అక్బర్ను పదవినుంచి తొలగించాలని, అలాగే రమణిపై కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసాయి.
మరోవైపు మనీ లైఫ్ ఇండియా మేగజైన్ కు ఎడిటర్ గా వ్యవహరిస్తున్న సుచేతా దలాల్... ప్రియరమణితో పాటు 14మంది ఇతర జర్నలిస్టులు కూడా స్థైర్యం కోల్పోరాదని, ఖర్చులకు కూడా వెరువరాదని హితవు పలికారు. జరిగిన అన్యాయంపై పోరాటం చేయాలంటే ఆర్థికంగా కూడా ఎంతో భరించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ప్రియా రమణి తరఫున వాదించేందుకు ప్రముఖ లాయర్లు చాలా మందే ఉన్నారని, అందుకయ్యే ఖర్చు కూడా తమ శక్తికొద్దీ భరిస్తామని సుచేతా దలాల్ ప్రతిపాదించడంతో... ఆ ట్వీట్ చాలా మంది ఫాలో అవుతూ తాము కూడా మద్దతుగా నిలుస్తామని ప్రకటించడం గమనార్హం.
కాగా పలు మహిళా జర్నలిస్టుల లైంగిక ఆరోపణల నేపథ్యంలో కేంద్రమంత్రి ఎంజే అక్బర్ ప్రియా రమణిపై దాదాపు41 పేజీలతో పరువునష్టం దావావేశారు. కరాంజవాలా సంస్థలోని 97మంది లాయర్లు (30మంది మహిళా లాయర్లు) మద్దతుతో ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ దావానునమోదు చేసిన సంగతి తెలిసిందే.