గాంధీనగర్ : గుజరాత్లోని అహ్మదాబాద్ పట్టణంలో గల మోటేరా స్టేడియం అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతుంది. త్వరలోనే ఈ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా గుర్తింపు దక్కించుకోబోతుందంటూ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పరిమల్ నథ్వాని ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితమే ఈ స్టేడియం విస్తరణ పనులు చేపట్టారని.. త్వరలోనే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా నిలవనుందంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పరిమల్ ట్వీట్ చేశారు.
‘ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. మెల్బోర్న్ కంటే పెద్ద స్టేడియాన్ని అహ్మదాబాద్లోని మోటేరాలో నిర్మిస్తున్నాం. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కలల ప్రాజెక్ట్ అయిన ఈ మైదానం పూర్తయితే యావత్ దేశానికి కీర్తి తీసుకోస్తుందం’టూ పరిమల్ ట్వీట్ చేశారు. 2011 డిసెంబరు వరకు ఈ మైదానంలో 23 వన్డే మ్యాచ్లు జరిగాయి. మోటేరా స్టేడియంను 1982లో నిర్మించారు. దాదాపు 49వేల మంది ఈ మైదానంలో కూర్చుని మ్యాచ్ను వీక్షించొచ్చు. 1983లో ఈ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్ వెస్టిండిస్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది.