సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణస్వీకారానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. ఒక్కసారి గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ప్రధానంగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భాలను ఆయన ఒక్కసారిగా గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. గుజరాత్లో బీజేపీ వరుసగా ఆరోదఫా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం విజయ్ రూపానీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
రూపానీ ప్రమాణ స్వీకారానికి హాజరైన మోదీ.. ఒక్కసారిగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001, 2002, 2007, 2012 సంవత్సరాల్లో చేసిన ప్రమాణ స్వీకర సందర్భాలను ఆయన ట్విటర్లో ట్వీట్ చేశారు. గుజరాత్ రాష్ట్రాన్ని పాలించే అవకాశాన్ని మరోసారి బీజేపీకి కల్పించిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు చెప్పారు. గుజరాత్-బీజేపీ బంధం చాలా ప్రత్యేకమైందిగా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధికి మైలురాయిగా నిలుపుతామని ఆయన గుజరాత్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్కు 13 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.