చండీఘడ్ : డ్రగ్ మాఫియాను అంతమొందించేందుకు పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై నిషేధిత డ్రగ్స్ విక్రయించే, అక్రమ రవాణాకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేలా కఠిన చట్టాన్ని రూపొందించేందుకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ‘తరతరాలను నాశనం చేయగల శక్తి డ్రగ్స్కు ఉంది. వీటిని నివారించేందుకు కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉంది. డ్రగ్ ఫ్రీ పంజాబ్ పట్ల శ్రద్ధ వహిస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానంటూ’ అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు.
డ్రగ్ మాఫియాను అరికడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినఅమరీందర్ సింగ్ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదంటూ ప్రతిపక్షం శిరోమణి అకాళీదళ్ గత కొన్ని రోజులుగా విమర్శల దాడి పెంచింది. ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.