న్యూఢిల్లీ: కరోనా కేసులు దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో మోదీ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. లాక్డౌన్ నాలుగు దశల్లో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదైన తీరును గ్రాఫ్ల ద్వారా చూపించారు. ఈ పోస్టుకు 'పిచ్చితనంతో పదే పదే ఒకే పనిని చేస్తూ భిన్నమైన ఫలితాలను ఆశిస్తున్నారంటూ' వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు.
కాగా.. మార్చి 24 న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటన చేసినప్పటికి దేశవ్యాప్తంగా కేవలం 500 కరోనా కేసులు ఉన్నాయి. రెండు నెలల సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం ప్రస్తుతం భారత్లో 3 లక్షలకు పైగా కేసులు.. 8 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. దేశంలో గడిచిన రెండు రోజుల్లో అత్యధికంగా రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మోదీ ప్రభుత్వం అన్లాక్ 1.0 పేరుతో సడలింపులు ఇచ్చింది. దీంతో రాష్ట్రాల మధ్య రాకపోకలు విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా మందిరాలు తెరచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. చదవండి: 60 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా ప్లాస్మా థెరపీ