ముంబై : పౌరసత్వ సవరణ చట్టంతో దేశంలో నెలకొన్న పరిస్థితులపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. శనివారం మాజీ ప్రధాని లాల్ బహుదూర్శాస్త్రి 26వ మొమోరియల్ లెక్చర్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవాస్కర్ హాజరయ్యరు. 'ప్రస్తుతం దేశం సంక్షోభంలో ఉంది. తరగతి గదుల్లో ఉండాల్సిన కొందరు విద్యార్థులు రోడ్లపై కనిపిస్తున్నారు. వీరిలో కొందరు ఆందోళన చేస్తూ ఆసుపత్రుల పాలవుతున్నారు.మనం అందరం భారతీయులుగా కలిసి ఉన్నప్పుడే దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లవచ్చు. దేశంలో వచ్చే ఏ సంక్షోభాన్ని అయినా దైర్యంగా ఎదుర్కొనగలుగుతాం. మేము క్రికెట్ ఆటలో కూడా ఎన్నో సంక్షోభాలు చవిచూశాం. కానీ మేమంతా ఆ సమయంలో ఒక జట్టుగా కలిసి ముందుకు సాగడం వల్లే ఆటలో అనేక విజయాలు సాధించగలిగామని' గవాస్కర్ పేర్కొన్నాడు. పౌరసత్వ సవరణ చట్టం అమలును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఢిల్లీలోని జేఎన్యూ, జామిమా మిలియా యునివర్సిటీ, దేశవ్యాప్తంగా పలు యునివర్సిటీలు సీఏఏను వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగించిన సంగతి విదితమే.
దేశం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది : గవాస్కర్
12 Jan, 2020 11:40 IST