సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఆంధ్రప్రజలను కొడుతున్నారన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విమర్శించారు. ఈ మేరకు ..‘ దేశంలోని 29 రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో నివసిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అన్ని రాష్ట్రాల వాళ్లు ఇక్కడ చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు. కొంతమంది కావాలనే పనిగట్టుకుని దుష్ప్రచారాలు ప్రసారం చేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.
కాగా ‘మనం ఇక్కడ మతాలుగా, కులాలుగా విడిపోయి కొట్టుకుంటున్నాం.. కానీ తెలంగాణలో ఆంధ్రవాళ్లంటే అలుసు.. కుల వర్గ భేదాలు లేకుండా మన వాళ్లను కొడుతున్నారు’ అంటూ పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధ్యతాయుతమైన ఓ వ్యక్తి తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం సరికాదని పలువురు పవన్కు హితవు పలుకుతున్నారు.